23-08-2025 01:34:37 PM
బలవంతంగా పాత స్టాక్ మందులను అంటగడుతున్న ఫర్టిలైజర్స్.
పట్టించుకోని అధికారులు
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): పంటలను కాపాడుకునేందుకు వినియోగించే యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు ఒకటే బస్తా ఇస్తుండడంతో రోజుల తరబడి యూరియా(Urea) కోసం యాతన అనుభవిస్తున్నారు. ఈ పరిస్థితిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఆయా ఫర్టిలైజర్ దుకాణదారులకు కూడా యూరియా సరఫరా చేసింది. కానీ రైతుల అవసరాలను ఆసరాగా చేసుకున్న ఫర్టిలైజర్ దుకాణదారులు యూరియా కొనుగోలుతో పాటు ఇతర ఓల్డ్ స్టాక్ పురుగు మందులను కూడా బలవంతంగా రైతులకు అంటగడుతున్నారు.
శనివారం జిల్లా కేంద్రంలోని నాగార్జున ఫర్టిలైజర్ దుకాణదారుడు(Nagarjuna Fertilizer Shopkeeper) పాత స్టాకు పురుగులో మందు తోపాటు యూరియా బస్తా మీద సుమారు 20 నుండి 30 దాకా అదనంగా వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపించారు. దీంతో రైతులు మరింత అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్న పరిస్థితి ఏర్పడింది. ఇతర పురుగుమందులు వద్దని వారించిన రైతులకు యూరియా లేదంటూ బయటికి గెంటేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలు సంబంధిత అధికారులకు తెలిసినప్పటికీ పట్టించుకోవడం లేదని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.