ఉత్తమ విద్యా ప్రమాణాలతో అత్యుత్తమ ఫలితాలు సాధించాలి
జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్..
మహబూబాబాద్ (విజయక్రాంతి): పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి ఉత్తమ విద్యా ప్రమాణాలతో విద్యాబోధన చేసి అత్యున్నత ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్(District Collector Adwait Kumar Singh) అన్నారు. గురువారం మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ సీరోలు మండలంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ ముందుగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలోని బాలుర, బాలికల వసతి గృహాలను, విద్యార్థులకు సంబందించిన స్టడీ రూమ్, చుట్టూ పరిసరాలు పరిశీలించారు. కిచెన్, నిలువ చేసిన ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలు, బియ్యం, త్రాగు నీరు సౌకర్యాలను తనిఖీ చేసారు. భోజన మెనూ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులకు శుచి, శుభ్రతలతో కూడిన నాణ్యమైన భోజనం అందించాలన్నారు. అనంతరం జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలను తనిఖీ చేసి విద్యార్థుల సంఖ్య, హాజరును పరిశీలించారు. కంప్యూటర్ ల్యాబ్ ను తనిఖీ చేసి విద్యార్థుల్లో పాఠశాల స్థాయిలోనే కంప్యూటర్ పరిజ్ఞానాన్ని కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందుకోసం ఉపాద్యాయులు విద్యార్థులకు కంప్యూటర్ విద్యపై పట్టు సాదించేలా కంప్యూటర్ విద్యనూ బోదించాలన్నారు. విద్యార్థులను వివిధ అంశాలపై అడిగిన పలు ప్రశ్నలకు విద్యార్థులు సరైన సమాధానం చెప్పడంతో విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. ఈ తనిఖీలో కలెక్టర్ వెంట తహసిల్దార్ పున్నంచందర్, ప్రిన్సిపాల్ సంతోష్ సోని, పాఠశాల హెడ్మాస్టర్ బంగారి, ఆర్.ఐ లు సుమతి, శ్రావణి, గ్రామ పాలన అధికారి వీరస్వామి ఉన్నారు.




