రామాయంపేట నియోజకవర్గం కోసం కార్యాచరణ
ర్యాలీ, రౌండ్ టేబుల్ సమావేశం
రామాయంపేట, మార్చి 26 : అప్పట్లో ఉనికి కోల్పోయిన నియోజకవర్గం.. ఘన చరిత్ర ఉన్న రామా యంపేట అసెంబ్లీ చరిత్ర పుటల్లో తొలగింది. అయితే అదృష్టమా అని 2027లో తిరిగి డీ -లిమిటేషన్ జరగనుంది. ఈ నేపథ్యంలో పూర్వ వైభవం కోసం మరో ఉద్యమం ఆరంభమైంది. ఈసారి ఎలాగైనా రామాయంపేటను నియోజకవర్గంగా చూడాలంటూ శాంతియుత ఉద్యమం మొదలైంది. బుధ, గురువారాల్లో కార్యచరణ రూపొందించే పనిలో పడ్డారు.
గురువారం మొదట బిఆర్ఎస్ మెగా ర్యాలీ చేపట్టి తహసిల్ కార్యాలయంలో కొత్త నియోజకవర్గాల్లో రామాయంపేట చేర్చాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం అందజేసింది. అనంతరం ప్రతిపక్ష నేతలు రౌండ్ టేబుల్ సమావేశమై ఎంతటి త్యాగాలకైనా వెనకాడకుండా పోరాటాన్ని నెరపాలని తీర్మానించారు. అందరం ఐక్యంగా ఉండి పోరాట పటిమతో ముందుకు సాగాలని నిర్ణయించారు. దీనిలో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసి పలు బాధ్యతలు అప్పగించడం జరిగింది.




