calender_icon.png 20 August, 2025 | 9:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యారంగ అభివృద్ధికి కృషి

20-08-2025 12:17:42 AM

జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): విద్యారంగ అభివృద్ధి దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలను సందర్శించి తరగతి గదులు, రిజిస్టర్లు, ప్రయోగశాల, వంటశాల, పారిశుద్ధ్య నిర్వహణ అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల సౌకర్యార్థం సకల సదుపాయాలు కల్పించి నిష్ణాతులైన ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని తెలిపారు.

విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని, ఆహారం తయారీలో తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యవసర సరుకులను వినియోగించాలని, శుద్ధమైన త్రాగునీటిని అందించాలని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, వర్చువల్ రియాలిటీ పద్ధతిలో విద్యార్థులకు బోధించాలని తెలిపారు. పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని, వర్షాకాలం అయినందున వ్యాధుల వ్యాప్తిని నిరోధించే విధంగా వ్యక్తిగత పరిశుభ్రతపై విద్యార్థులకు వివరించాలని తెలిపారు. పాఠశాలలో చేయవలసిన మరమ్మత్తులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

అనంతరం జనకాపూర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి రిజిస్టర్లు, విద్యార్థుల హాజరు, విద్యా బోధన, మధ్యాహ్న భోజనం అంశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆసిఫాబాద్ మున్సిపల్ పరిధిలోని భవిత కేంద్రాన్ని సందర్శించి రికార్డుల పరిశీలన, విద్యార్థుల నమోదు వివరాలతో పాటు నూతనంగా నిర్మిస్తున్న భవిత కేంద్రం నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు భవిత కేంద్రం ద్వారా విద్యా బోధన చేయడం జరుగుతుందని, ఈ క్రమంలో విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, నూతన భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.