ఏకాగ్రత, మేధస్సు పెంపొందించేందుకు చెస్ చాలా ఉపయోగకరం
హనుమకొండ,(విజయక్రాంతి): హరిత కాకతీయ హోటల్ లో రుద్రమదేవి చెస్ అకాడమీ, సేవా టూరిజం అండ్ కల్చరల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యం లో చెస్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించా రు. ఈ టోర్నమెంటు అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) ఎన్.రవి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ప్రారంభోత్సవసందర్భంగా ఆయన చిన్నారులతో కలిసి చెస్ ఆడి టోర్నమెంట్ను ప్రారంభించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ రవి మాట్లాడుతూ చిన్నారుల్లో మేధస్సు, ఏకాగ్రతను పెంపొందించేందుకు ఇలాంటి చెస్ పోటీలు ఎంతో ఉపయోగకరమని,భవిష్యత్తులో కూడా మరిన్ని పోటీలు నిర్వహించాలన్నారు.అనంతరం విజేతలకు డాక్టర్ కూరపాటి ఫౌండేషన్, హాస్పిటల్స్ అధినేత డా. కూరపాటి రమేష్,డా. కూరపాటి రాధిక ట్రోఫీలు, మెడల్స్, సర్టిఫికేట్లు, నగదు బహుమ తులు అందజేశారు. టోర్నమెంట్ లో వివిధ వయస్సు విభాగాల్లో పోటీలు నిర్వహించారు.
6, 8,10, 12, 14 సంవత్సరాల లోపు బాలురు, బాలికలకు ప్రత్యేకంగా బహుమతులు అందజేశారు. ఈ పోటీల్లో తెలంగాణలోని వివిధ జిల్లాలు కొత్తగూడెం, కరీంనగర్, హైదరాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. మొత్తం సుమారు 145 మంది పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా టూరిజం అధికారి ఎం. శివాజీ, సేవా టూరిజం అండ్ కల్చరల్ సొసైటీ ఫౌండర్ ప్రెసిడెంట్ డా.కుసుమ సూర్య కిరణ్, రుద్రమదేవి చెస్ అకాడమీ డైరెక్టర్లు రాజు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.






