20-06-2025 12:26:32 AM
బ్లాక్బాక్స్ను విదేశాలకు తరలిస్తారన్న వార్తలను తోసిపుచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ, జూన్ 19: అహ్మదాబాద్ విమాన ప్రమాదం యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన ఎయిరిండియా విమానం కొద్దిసేపటికే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 270 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, దర్యాప్తులో కీలకమైన బ్లాక్బాక్స్ ప్రమాదంలో దెబ్బతిన్నట్టు తెలిసింది.
దీంతో అందులోని డేటాను విశ్లేషించేందుకు బ్లాక్బాక్స్ను విదేశాలకు పంపనున్నట్లు గురువారం ఉదయం వెలువడిన వార్తలను కేంద్రం తోసిపుచ్చింది. బ్లాక్బాక్స్ను ఎక్కడికి తరలించడం లేదని.. ఏఏఐబీ (ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో) దానిని డీకోడింగ్ చేస్తుందని క్లారిటీ ఇచ్చింది. సాధారణంగా విమానం తోకభాగంలో బ్లాక్బాక్స్ను అమరుస్తారు.
ప్రమాదాల్లో పేలుడు ద్వారా ఉత్పన్నమయ్యే మంటలను తట్టుకునేలా, 1100 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద గంటపాటు ఉన్నా ధ్వంసం కాకుండా వీటిని రూపొందిస్తారు. ఘటనా స్థలిలో రెండు బ్లాక్బాక్స్లతో పాటు సీవీసీ రికార్డర్ లభ్యమయ్యాయి. కాగా విమాన ప్రమాదం అనంతరం వెయ్యి డిగ్రీల ఉష్ణోగ్రతతో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే.