20-06-2025 12:23:35 AM
ఆ రోజులు త్వరలోనే రానున్నాయి
‘మై బూంద్ స్వయం, ఖుద్ సాగర్ హూన్’ పుస్తకావిష్కరణలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా
న్యూఢిల్లీ, జూన్ 19: భారత్లో ఇంగ్లిష్లో మాట్లాడే వారు త్వరలోనే సిగ్గుపడే రోజులు రానున్నాయని కేంద్ర మంత్రి అమిత్షా పేర్కొన్నారు. మాజీ ఐఏఎస్ అశుతోష్ అగ్నిహోత్రి రాసిన ‘మై బూంద్ స్వయం, ఖుద్ సాగర్ హూన్’ పుస్తకావిష్కరణ గురువారం న్యూఢిల్లీలో జరగ్గా ఆ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన షా పై వ్యాఖ్యలు చేశారు. ‘ఈ దేశంలో ఇంగ్లిష్లో మాట్లాడే వారు తొందరలోనే సిగ్గుపడతారు.
అటువంటి రోజులు ఎంతో దూరంలో లేవు. మన దేశ భాషలే మన సంస్కృతికి ఆభరణాలు. మన భాషలు లేకుండా మనం నిజమైన భారతీయులుగా ఉండలేం. భారతదేశ భాషా వారసత్వాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నాలు జరగాలి. ఇంగ్లిష్ అనేది బానిసత్వానికి ప్రతీకగా తిరస్కరిస్తాం.
మన దేశాన్ని.. మన భాషను.. మన సంస్కృతిని అర్థం చేసుకోవడం ఏ విదేశీ భాష వల్ల కాదు. సగం కాల్చిన విదేశీ భాషల వల్ల సంపూర్ణ భారతదేశాన్ని అర్థం చేసుకోలేం. ఇది ఎంత కష్టమో నాకు తెలుసు. ఈ భాషా యుద్ధంలో ఆత్మగౌరవంతో భారత సమాజం తప్పక నెగ్గుతుందని నేను పూర్తిగా విశ్వసిస్తున్నా. సొంత భాషతోనే మేము దేశాన్ని ముందుకు నడిపిస్తాం. . ప్రపంచాన్ని కూడా ముందుకు నడిపిస్తాం.’ అని తెలిపారు.