20-06-2025 12:29:34 AM
న్యూఢిల్లీ, జూన్ 19: అహ్మదాబాద్లో ఎయిరిండియా విమాన ప్రమాదంలో 270 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజా గా 215 మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు పూ ర్తవ్వగా.. 198 మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అందించినట్టు సివిల్స్ ఆసుపత్రి మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ రాకేశ్ జోషి వెల్లడించారు.
మిగిలిన మృతదేహాలకు పరీక్షలు ఇంకా కొనసాగుతున్నాయని, మరో మూడు రోజుల్లో డీఎన్ఏ టెస్టులు పూర్తవుతాయని తెలిపారు. అధికారులు అప్పగించిన 198 మృతదేహాల్లో భారత్కు చెందినవి 149 కాగా.. 32 మంది బ్రిటన్, ఏడుగురు పోర్చుగీస్ , ఒక కెనడియన్ ఉన్నారు. మరో 9 మృతదేహాలకు సంబంధించి వివరాలు తెలియరాలేదన్నారు.
ఈ నెల 21 నుంచి జూలై 15 వరకు..
విమాన సర్వీసుల తగ్గింపుపై ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా విమాన సర్వీసులను తాత్కాలికంగా తగ్గిస్తున్నట్టు ఎయిరిండియా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 21 నుంచి జూలై 15 వరకు బోయింగ్ 787, 777 విమాన సర్వీసులను తాత్కాలికంగా తగ్గిస్తున్నట్టు తెలిపింది. భద్రతా తనిఖీల పెంపులో భాగంగానే విమాన సర్వీసులు తగ్గించినట్టు ఎయిరిండియా పేర్కొంది.
అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన తర్వాత టేకాఫ్, సాంకేతిక లోపాలు, తదితర కారణాలతో దాదాపు 10కి పైగా ఎయిరిండియా విమానాలు రద్దయిన సంగతి తెలిసిందే. మరోవైపు ఎయిరిండియా విమాన ప్రమాదంపై కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది.
ప్రమాద ఘటనపై ఏఏఐబీ నేతృత్వంలో అమెరికా, యూకే నిపుణులు, బోయింగ్, జనరల్ ఎలక్ట్రిక్, ఎయిరిండియా, భారత నియంత్రణ సంస్థల ప్రతినిధుల సహకారంతో యూన్ఐసీఏవో ప్రోటోకాల్ ప్రకారం విచారణ జరుగుతోందని తెలిపింది.
బ్లాక్ బాక్స్ డీకోడింగ్ నిర్ణయం ఏఏఐబీ సాంకేతిక ఆధారంగానే ఆధారంగానే ఉంటుందని పౌర విమానయాన శాఖ స్పష్టం చేసింది. ఇక ఎయిరిండియా బోయిర్ 787-8, 787-9 ఫ్లీట్లోని 24 విమానాల్లో తనిఖీలు పూర్తయ్యాయని వాటిలో ఎలాంటి లోపాలు లేవని డీజీసీఏ పేర్కొంది.