03-07-2025 02:40:22 AM
హైదరాబాద్, జులై 2 (విజయక్రాంతి): గ్రామశాఖ అధ్యక్షులతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేరుగా సమావేశం కావడం దేశంలోనే తొలిసారిగా తెలంగాణ నుంచే శ్రీకారం చుడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆ తర్వాత ఇలాంటి సమావేశాలు ఇక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నిర్వహిస్తారని చెప్పారు.
ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షినటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షులు రోహిన్రెడ్డి తదితరులు ఎల్బీ స్టేడియంలోని సభా ఏర్పాట్ల ను బుధవారం పరిశీలించారు.
అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేరుగా పార్టీ గ్రామశాఖ అధ్యక్షులతో మాట్లాడే కార్యక్రమానికి మొద టి అవకాశం తెలంగాణకు ఇచ్చిన ఏఐసీసీకి కృతజ్ఞతలు తెలిపారు.
ఎల్బీ స్టేడియంలో నిర్వహించే సభకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, శుక్రవారం సాయం త్రం మూడు గంటల కల్లా రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, మండల, జిల్లా కమిటీ అధ్యక్షులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు పార్టీ శ్రేణులు హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న సభకు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఒకరికొకరు సమాచారం చేరవేసుకుని సమన్వయంతో సభకు వచ్చి విజయవంతం చేయాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.