03-07-2025 02:38:27 AM
హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): తెలంగాణ, కజకిస్థాన్ ప్రభుత్వాల మధ్య బంధం మరింత బలోపేతం కానుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్లోని తెలంగాణ, ఏపీ కాన్సుల్ ఆఫ్ కజకిస్థాన్ డాక్టర్ నవాబ్ మీర్ నసీర్ అలీ బుధవారం ప్రజాభవన్లో భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ, కజకిస్థాన్ మధ్య వ్యాపార సహకర అవకాశాలపై విస్తృతంగా చర్చించారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ, కజకిస్థాన్ ప్రభుత్వాల మధ్య ఆర్థిక, సాంస్కృతీ సంబంధాలను మరింత మెరుగుపరిచే దిశగా కీలక అడుగు పడిందన్నారు. ద్వైపాక్షిక వాణిజ్యం, ఆరోగ్య, విద్య, రవాణా రంగాల్లో భాగస్వామ్యాలను విస్తరించడంపై దృష్టి సారించినట్టు స్పష్టం చేశారు.
హైదరాబాద్కు చెందిన ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, కజక్ ఇన్వెస్ట్ మధ్య కజకిస్థాన్లో ఫార్మాస్యూటికల్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు సంబంధించి ఇటీవల కుదిరిన ఒప్పందం గురించి డాక్టర్ నసీర్ అలీ ఖాన్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వివరించారు. ఈ సందర్బంగా డాక్టర్ ఖాన్ మాట్లా డుతూ.. ఈ ఒప్పందం ఇండియా, కజకిస్థాన్ సహకారానికి ఒక మైలురాయిగా నిలుస్తుందని అభివర్ణించారు.
హైదరాబాద్, అల్మాటి మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించేందుకు చర్చలు జరుగుతున్నట్టు తెలిపారు. ఈ విషయంపై జీఎంఆర్ ఎయిర్పోర్ట్లో ఎయిర్లైన్ మార్కెటింగ్, రూట్ డెవలప్మెంట్ హెడ్ మిస్టర్ ఆనంద్ ఆచార్యతో జరిగిన సమావేశ వివరాలు భట్టి విక్రమార్కతో పంచుకున్నారు. డైరెక్ట్ ఫ్లుటై సర్వీసుల తో టూరిజం, వాణిజ్యం, సాంస్కృతిక మా ర్పిడి అభివృద్ధికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.
ఆరోగ్య, విద్యా రంగాల్లో కూడా సహకారం పెంచేందుకు చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అపోలో హాస్పిటల్స్ గ్రూప్ సీఈవో డాక్టర్ శ్రీనివాస్రావుతో కలిసి కజకిస్థాన్లో మెడికల్ విద్య, ప్రపంచస్థాయి ఆసుపత్రి స్థాపనపై చర్చలు జరుగుతున్నాయని వివరించారు.
కజకిస్థాన్తో పెరుగుతున్న బంధం పట్ల ఆనందం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తుందని హామీ ఇచ్చారు. కజకిస్థాన్ సందర్శనకు రావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను డాక్టర్ నసీర్ అలీ ఖాన్ ఆహ్వానించారు.