calender_icon.png 7 June, 2025 | 9:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఉల్లాస్’తో అక్షర వెలుగులు!

04-06-2025 12:41:10 AM

  1. ఈనెల 15 నుంచి అమలుకు శ్రీకారం
  2. మహిళా సంఘాలు, స్వచ్ఛంద బోధకులతో శిక్షణ
  3. 15 ఏళ్లు పైబడిన వారికి చదువు 
  4. జిల్లాలో 55,371 మంది లక్ష్యంగా ముందడుగు

సంగారెడ్డి, జూన్ 3(విజయక్రాంతి): మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడమే కాకుండా వారికి అక్షరజ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్ అనే కార్యక్రమాన్ని చేపడుతోంది. ఉల్లాస్ ఉద్దేశ్యం మహిళలు అక్షరాలను గుర్తించడం, చదవడం, రాయడం, కూడికలు చేయడం, కనీస సామర్థ్యాలను పెంపొందించడం కోసం ఏర్పాటు చేశారు.

స్వయం సహాయక సంఘాల మహిళలు నిరక్షరాస్యలుగా ఉండకుండా వారిని అక్షరాస్యులుగా  తీర్చిదిద్దితే వారు మరింత ఆర్థికంగా బలోపేతం అవుతారని కేంద్రం ముఖ్య ఉద్దేశం. సంగారెడ్డి జిల్లా అక్షరాస్యతలో కొంత వెనుకంజలో ఉంది. రాష్ట్రస్థాయిలో 13వ స్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా 64.08 శాతం అక్షరాస్యత కలిగివుండగా, ఇందులో పురుషులు 73.02 శాతం, మహిళలు 54.84 శాతం ఉన్నారు.

ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే చదువుతోనే సాధ్యమనేది విదితమే. గతంలో అక్షరాస్యత పెంచేందుకు వయోజన విద్య, చదువుల పండగ, సాక్షర భారత్ ద్వారా కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ అనుకున్న లక్ష్యాలు నెరవేర్చలేదు. మరోసారి కేంద్రం నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు ఉల్లాస్ (అండర్ స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

నవభారత్ సాక్షరత కార్యక్రమాన్ని చేపడుతోంది. 2026-27 వరకు ఇది అమలు చేయనుంది. జిల్లాలో అక్షరాస్యత శాతం 63.29 ఉండగా.. ఈ కార్యక్రమం ద్వారా పెంచేందుకు వయోజన విద్యాశాఖ చర్యలు చేపట్టింది. మహిళా సంఘాల ద్వారా అక్షరాస్యత పెంపొందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 

మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు.. 

నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మా ర్చేందుకు మహిళా సంఘాలు, స్వ చ్ఛంద సంస్థలు, యువత తదితరులతో బోధన చేసేందుకు ప్రభుత్వం చర్య లు చేపడుతుంది. అంగన్వాడీలు, మహిళా సంఘాలు, ఆర్పీల ద్వారా ఎంత మంది నిరక్షరాస్యులు ఉన్నారనేది గుర్తిస్తున్నారు. జిల్లాలో 695 గ్రామ సమైఖ్య, 25 మండల సమైఖ్య సంఘాలు ఉన్నాయి. 18,477 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి.

ఇందులో 1,93,453 మంది సభ్యులు ఉన్నారు. అయితే ఈ సంఘాల్లో ఎంత మంది అక్షరాస్యులు ఉన్నారనే వివరాలు సేకరిస్తున్నారు. వారితో సంఘాల్లో ఉన్న నిరక్షరాస్యులకు బోధన చేయనున్నారు. ఈ కార్యక్రమం డీఆర్డీఏ, మెప్పా సహకారంతో వాలంటరీగా కార్యక్రమం చేపట్టనున్నారు. జిల్లాలో 55,371 మందిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వయోజన విద్య అధికారులు చెబుతున్నారు. 

జూన్ 15 నుంచి అమలుకు కసరత్తు... 

ఉల్లాస్ కార్యక్రమాన్ని జూన్ 15 నుంచి ఆఫ్లైన్, ఆన్లైన్ ద్వారా అమలు చేయడానికి కసరత్తు చేపడుతున్నట్లు తెలుస్తోంది. బోధన చేసేందుకు స్వచ్చందంగా ముందుకు వచ్చిన వారితో నిరక్షరాస్యులకు చదువు చెప్పించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. పాఠశాలలు, సామాజిక కేంద్రాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, కమ్యూనిటీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రంథాలయాల్లో బోధన కొనసాగనుంది.

ఇందుకు సంబంధించి ఎస్ సీఈఆర్టీ వయోజన విద్యకు సంబంధించిన పుస్తకాలను రూపొందించింది. అయితే ఆన్ లైన్ ద్వారా తెలుగుతో పాటు ఇతర భాషలను నేర్చుకునే అవకాశం సైతం ఉంది. అభ్యసనకు సంబంధించిన సామగ్రి, డిజిటల్ పరికరాలు, మౌలిక, సాంకేతిక సదుపాయాలు, లర్నింగ్ టూల్స్, అవగాహన కార్యక్రమాలు, అక్షరాస్యత మేళాలు, సామాజిక చైతన్య, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు.

రోజుకు రెండు గంటల పాటు బోధన చేయనున్నారు. ఆరు నెలల పాటు కార్యక్రమం కొనసాగుతుంది. ఆ తర్వాత నేషనల్ ఇనిస్టి ట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ (ఎన్‌ఐఓఎస్) పరీక్ష నిర్వహిస్తారు. హాజరైన వారికి అక్షరాస్యులుగా సర్టిఫికెట్ అందజేయనున్నారు. 

పకడ్బందీగా అమలు చేస్తాం

నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు ప్రభుత్వం ఉల్లాస్ కార్యక్రమాన్ని చేపడుతుంది. ప్రస్తుతం నిరక్షరాస్యుల గుర్తింపు సర్వే నిర్వహిస్తున్నాం. సర్వే పూర్తికాగానే ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. జిల్లాను అక్షరాస్యత శాతంలో ముందుంచేందుకు కృషి చేస్తున్నాం. డీఆర్డీఏ, మెప్మా సహకారంతో వాలంటరీ కార్యక్రమంగా ఈ కార్యక్రమం చేపట్టనున్నాం. జిల్లాకు గాను 55,371 మందిని లక్ష్యంగా ఎంచుకున్నాం.

 కె.వెంకట్‌రెడ్డ్డి, ప్రాజెక్టు ఆఫీసర్, వయోజన విద్య