04-06-2025 12:52:09 AM
- రద్దీగా మారిన రేషన్ షాపులు
- నిరంతరాయంగా బియ్యం రవాణా
మహబూబాబాద్, జూన్ 3 (విజయ క్రాంతి): సన్న బియ్యం కోసం రేషన్ షాపుల వద్ద పేద ప్రజలు బారులు తీరారు. ఈసారి కేంద్ర ప్రభుత్వం మూడు నెలలకు సరిపడా బియ్యాన్ని ఒకేసారి విడుదల చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా సన్నబియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేసింది.
కేంద్ర ప్రభుత్వం ఒక్కో యూనిట్ కు ఐదు కిలోల చొప్పున, మూడు నెలలకు 15 కిలోలు కేటాయించగా, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా నెలకు ఒక్కో యూనిట్ కు ఒక కిలో చొప్పున కలిపి ఈనెల ఒకటి నుండి లబ్ధిదారులకు పంపిణీ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సన్న బియ్యం ఇస్తుండడంతో మూడు నెలల రేషన్ కోటా బియ్యం కోసం మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా రేషన్ షాపుల వద్ద పేదలు బారులు తీరుతున్నారు.
దొడ్డు బియ్యానికి బదులు ఏప్రిల్ నెల నుంచి రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం ఇస్తుండడంతో రేషన్ కార్డు దారుల్లో 90 శాతానికి పైగా తమకు కేటాయించిన బియ్యాన్ని తీసుకెళ్తున్నారు. ఫలితంగా రేషన్ షాపుల్లో రేషన్ బియ్యం స్టాక్ ఉండడం లేదు. పూర్తిగా ఉచితంగా అందులో సన్నబియ్యం ఇస్తుండడంతో పేదలంతా బియ్యం తీసుకెళ్లడానికి మొగ్గు చూపుతున్నారు.
ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సన్నబియ్యానికి తోడు, కేంద్ర ప్రభుత్వం మూడు నెలలకు సరిపడా బియ్యం ఇవ్వడానికి నిర్ణయించడంతో పేదలు రేషన్ బియ్యం షాపులకు పరుగులు పెడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా రేషన్ షాపుల ముందు లబ్ధిదారులు బియ్యం కోసం బారులు తీరుతున్నారు.
ఇలా వస్తున్నాయి అలా వెళ్తున్నాయి.. నిరంతరాయంగా బియ్యం రవాణా
మహబూబాబాద్ జిల్లాలో రేషన్ కార్డు దారులకు ఒకేసారి మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం పంపిణీకి అధికారులు చర్యలు చేపట్టారు. దీనితో జిల్లాలోని మహబూబాబాద్, కేసముద్రం, తొర్రూరు, గార్ల, మరిపెడ, కొత్తగూడా మండల స్థాయి బియ్యం స్టాక్ పాయింట్ల నుంచి రేషన్ షాపులకు నిరంతరాయంగా లారీలు, ట్రాక్టర్ల ద్వారా బియ్యం రవాణా చేస్తున్నారు.
జిల్లాలో 2 లక్షల 43 వేలకు పైగా రేషన్ కార్డులు ఉండగా, ప్రతినెల 4,805 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ జరుగుతుండగా, ఈసారి జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి ఒకేసారి మూడు నెలల బియ్యం 14,415 మెట్రిక్ టన్నులు అవసరం కావడంతో, రైస్ మిల్లుల నుంచి సీఎంఆర్ కింద సేకరించి స్టేజ్ 1 గోదాము నుంచి స్టేజ్ 2 మండల స్థాయి స్టాక్ పాయింట్లకు పంపి అక్కడి నుంచి రేషన్ డీలర్లకు నేరుగా లారీల ద్వారా సరఫరా చేస్తున్నారు. కొద్దిసేపు కూడా గోదాం వద్ద బియ్యం లారీలను నిలపకుండా, ఇలా రాగానే అలా లారీలు, ట్రాక్టర్లలో దిగుమతి చేసి గ్రామాలకు తరలిస్తున్నారు.
నెల నెల తిరిగే గోస తప్పింది
చేతగాక పోయినా తప్పకుండా బియ్యం కోసం నెల నెల రేషన్ షాపుకు పోవాల్సి వచ్చేది. రేవంత్ రెడ్డి సర్కారు వచ్చినంక సన్నబియ్యం ఇస్తుండడంతో వాటితోనే జీవనం గడుస్తోంది. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ మూడు నెలల బియ్యాన్ని ఒక్కసారే ఇవ్వడం, రేవంత్ రెడ్డి సారు ఆ బియ్యం పూర్తిగా సన్నవి ఇవ్వడం మాకు మంచి బువ్వ తినే అవకాశం దక్కింది. అట్లనే నెల నెల రేషన్ షాపుకు పోయే గోస తప్పించారు.
ఊట్కూరి బుచ్చమ్మ, కేసముద్రం, మహబూబాబాద్ జిల్లా