మాదిగలంతా బీజేపీకి ఓటు వేయాలి

01-05-2024 01:14:56 AM

ఎస్సీ వర్గీకరణ చేస్తామని ప్రధాని మోదీ మాటిచ్చారు 

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు మాదిగలను మోసం చేశాయి 

ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ 

వికారాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): ప్రధాని మోదీ ఎస్సీ వర్గీకరణకు ఒప్పుకున్నారని, కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలంతా బీజేపీకీ ఓటు వేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కోరారు. చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి మద్దతుగా మంగళవారం వికారాబాద్‌లోని చిగుళ్లపల్లి మైదానంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ చేస్తామని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, దశాబ్దాలుగా మాదిగలను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగానే చూసిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ సైతం మాదిగల వాణి వినిపించకుండా అణగదొక్కిందని, మంత్రి రాజయ్యను బర్తరఫ్ చేసి అవమానించినట్లు గుర్తు చేశారు.

మాదిగలను అనేక సార్లు మోసం చేసిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు మాదిగలు, ఉప కులాలు ఓటు వేయొద్దని కోరారు. జనాభా ప్రాతిపదికన నాలుగు ఎంపీ సీట్లు ఇవ్వాల్సి ఉన్నా కాంగ్రెస్ ఒక్కచోట కూడా ఇవ్వలేదని, అదే బీజేపీ మూడు చోట్ల మాదిగలకు సీట్లు కేటాయించినట్లు తెలిపారు. బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి మాదిగలు అండగా ఉండాలని కోరారు. సభలో ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, సీనియర్ నాయకుడు వడ్ల నందు తదితరులు పాల్గొన్నారు.