08-09-2025 02:01:50 AM
ఆడంబర ప్రకటనలు మాని సకాలంలో జీతాలు చెల్లించండి: మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు
హైదరాబాద్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): కల్తీ ఆహారం పెడితే జైలుకే అని సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలు, ప్రకటనలన్నీ గాలి మాటలయ్యాయని మాజీమంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... ఉపాధ్యాయుల దినోత్సవం నాడు ఆడంబరంగా ప్రకటనలు చేయడం కాదని, ముందు వారికి సకాలంలో జీతాలు చెల్లించాలని సీఎం రేవంత్రెడ్డికి సూచించారు.
కాంగ్రెస్ పాలనలో గురుకుల విద్యావ్యవస్థ దీనస్థితికి చేరడం శోచనీయమని తెలిపారు. విషజ్వరాలు, పాముకాట్లు, ఎలుక కాట్లు, కుక్కకాట్లు, ఫుడ్ పాయిజనింగ్తో విద్యార్థులు ఆస్పత్రుల పాలై ప్రాణాలు కోల్పోయే పరిస్థితి దాపురించిందని విమర్శించారు. గురుకులాల్లో పనిచేస్తున్న 2,500 మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి రెండు నెలల నుంచి జీతాలు ఇవ్వని దుస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్రెడ్డి స్వయంగా నేనే ఇక నుంచి గురుకులాలను పర్యవేక్షిస్తానని చెప్పిన మాటలు నీటిమూటలు అయ్యాయని ఎద్దేవాచేశారు. కేసీఆర్ హయాంలో గురుకుల విద్యావ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిస్తే, రేవంత్రెడ్డి పాలనలో నరక కూపాలుగా మారాయని మండిపడ్డారు. నాడు 294గా ఉన్న గురుకులాల సంఖ్యను 1024కి పెంచిన ఘనత కేసీఆర్దేనని స్పష్టం చేశారు.
గురుకులాల్లో లక్షా 90 వేలుగా ఉన్న విద్యార్థుల సంఖ్యను ఆరున్నర లక్షలకు పెంచి నాణ్యమైన విద్యను కేసీఆర్ అందించారని తెలిపారు. విద్యపై చేసే వ్యయాన్ని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్గా భావించిన కేసీఆర్ గురుకులాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ 22 నెలల పాలనలో గురుకులాల ఖ్యాతి అధోఃపాతాళానికి దిగజారిందని, ఇది మీ అసమర్థత పాలనకు మరో నిదర్శనమని విమర్శించారు.
గురుకులాలంటే ఎందుకు అంత చిన్న చూపు అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఇప్పటికైనా కండ్లు తెరిచి గాడితప్పిన గురుకుల విద్యా వ్యవస్థపై శ్రద్ధ వహించాలని, తక్షణమే గురుకులాల సమస్యలను పరిష్కరించడంతోపాటు 2500 మంది కాంట్రాక్ట్, ఔర్ సోర్సింగ్ సిబ్బందికి పెండింగ్ జీతాలను చెల్లించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు.