వరికి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలి
- మూస పద్ధతి సాగుకు స్వస్తి పలకాలి
- జిల్లా ఉద్యానవన శాఖ అధికారి డి సంజీవరావు
ములుగు, జులై 10 (విజయ క్రాంతి): వరికి ప్రత్యామ్నాయంగా పంటలు సాగు చేసేందుకు రైతులు సిద్ధం కావాలని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి డి సంజీవరావు రైతులకు సూచించారు. శుక్రవారం ఆయన విజయ క్రాంతి ప్రతినిధితో మాట్లాడుతూ రాష్ట్రంలో ఏర్పడుతున్న వాతావరణ పరిస్థితులను ఉష్ణోగ్రత పెరుగుదల దృష్టిలో ఉంచుకొని వరికి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని సూచించార. జిల్లాలో లక్ష 30 వేల ఎకరాలపైగా అన్ని రకాల పంటలు సాగు విస్తీర్ణం ఉందని తెలిపారు.
దేశంలో 2026 జూన్, సెప్టెంబర్ వర్షపాతం సాధారణం కంటే తక్కువగా, దీర్ఘకాలికంగా సగటులో దాదాపు 90 శాతం తక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారం నేపథ్యంలో రైతులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సాధారణ వర్షపాతం దాదాపు 84శాతం తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఎల్ నీ నో ప్రభావమే ప్రధాన కారణమని తెలిపారు.
తీవ్ర వర్షాలకు, ఎక్కువ వర్షాలను ఎదుర్కొనే ప్రభావం ఉన్న కారణంగా ఒకే సీజన్లో అసమాన వర్షపాతం నమోదవుతుందని వర్షాలు ఆలస్యంగా రావడం, సుదీర్ఘకాలం పొడి వాతావరణ ఉండటం అకస్మాత్తుగా భారీ వర్షాలు రావడం వంటి పరిణామాలు ఎదుర్కొనేందుకు రైతులు సిద్ధం కావాలని తెలిపారు.
ఆయిల్ సీడ్ పంటలు, పశుగ్రాసాలను సాగు చేయవచ్చని జిల్లాలో ఇరిగేషన్ కెనాల్, చెరువులపై ఆధారపడకుండా బోరుబావులు నీటి వసతులు గల ప్రాంతాల్లో పప్పు దినుసులు నూనే గింజలు ఆయిల్ ఫామ్ కూరగాయలు పండ్ల తోటలు సాగు చేయాలని రైతులకు సూచించారు. రైతుల సంక్షేమం కోసం ఉద్యానవన శాఖ నిరంతరం శ్రమిస్తుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.






