22 June, 2026 | 2:59 AM

దిక్కులేని అంగన్‌వాడీ!

22-06-2026 01:26 AM
  1. 30 ఏళ్లుగా సొంత భవనం కరువు వర్షంలో బడి ఎక్కడ?
  2. ఈనెల 30లోపు ఖాళీ చేయాలని ఆదేశం టీచర్ ఎం.వరలక్ష్మి టీచర్ రమాప్రభ ఆవేదన

చర్ల: జూన్ 21 (విజయక్రాంతి) :చర్ల ప్రాజెక్టు తేగడ సెక్టార్ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రం దిక్కులేని స్థితిలో ఉంది. గత 30 సంవత్సరాలుగా గ్రామంలో అంగన్వాడీ సెంటర్ నడుస్తున్నా ఇంత వరకు సొంత భవనం మంజూరు కాలేదు. దీంతో టీచర్ ఎం.వరలక్ష్మి ప్రభుత్వ పాఠశాల గదిలో కేంద్రం నిర్వహిస్తున్నారు. తాజాగా ఆ గదిని కేంద్ర ప్రభుత్వ ప్రీ ప్రైమరీ స్కూల్కు కేటాయించడంతో ఈనెల 30వ తేదీలోగా ఖాళీ చేయాలని ప్రధానోపాధ్యాయురాలు ఆదేశించారు.

గుడికి స్థలం ఉంది, బడికి లేదు  

కొత్తపల్లి గ్రామస్తులు గుడి నిర్మాణానికి విరాళాలు వేసుకొని స్థలాలు కొనుగోలు చేశారు. కానీ అంగన్వాడీ భవనం కోసం మాత్రం స్థలం ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. గ్రామంలో సొంత స్థలం ఇస్తే ప్రభుత్వం భవనం మంజూరు చేస్తామని చెబుతున్నా ఫలితం లేదు. 

‘అంబేద్కర్ గారు చెప్పినట్టు గుడులు కడితే బిచ్చగాళ్లు, బడులు కడితే మేధావులు తయారవుతారు. కానీ మా ఊర్లో చదువు విలువ తెలిసిన వారు తక్కువ. ఎక్కువ మంది వ్యవసాయదారులే. అందుకే పిల్లల భవిష్యత్తు పట్టించుకునే వారు లేరు‘ అని స్థానికులు వాపోతున్నారు.

అధికారులు, ఎమ్మెల్యే దాకా ఫిర్యాదు  

ఈ సమస్యపై ఎం.వరలక్ష్మి ఎమ్మార్వో, ఎంపీడీవో, ఎంఈఓ నుంచి స్థానిక ఎమ్మెల్యే వరకు పలుమార్లు విన్నవించారు. అయినా ఇప్పటివరకు పరిష్కారం కరువైంది. వర్షాకాలం మొదలైంది. ప్రత్యామ్నాయ గది లేకపోవడంతో పిల్లలను ఎక్కడ కూర్చోబెట్టి కేంద్రం నిర్వహించాలో తెలియక టీచర్ సతమతమవుతున్నారు.

ఐసీడీఎస్ నిబంధనల ప్రకారం  

అంగన్వాడీ కేంద్రానికి సొంత భవనం లేనప్పుడు గ్రామ పంచాయతీ స్థలం కేటాయించాలి. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి తాత్కాలిక షెడ్ ఏర్పాటు చేయించాలి. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి కొత్తపల్లి గ్రామంలో అంగన్వాడీ రెండవ సెంటర్కు తాత్కాలిక స్థలం, భవనం మంజూరు చేయాలని గ్రామస్తులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రభుత్వం ‘పోషణ్ అభియాన్‘, ‘బాలల సంరక్షణ‘ గురించి గొప్పలు చెబుతుంది. మొదటి మెట్టు అయిన అంగన్వాడీ కేంద్రాలకే పునాదులు లేకపోవడం విడ్డూరం. ఈనెల 30 తర్వాత వర్షంలో తడిస్తూనే పిల్లలకు చదువు చెప్పాల్సిన పరిస్థితి టీచర్ వరలక్ష్మికి, రెండవ సెంటర్ రమాప్రభ కి  ఎదురుకానుంది.