ఆపై హైదరాబాద్ మనకే
జూన్ 2 ఏపీ విభజన చట్టం క్లోజ్
తెలంగాణలోని ఏపీ కార్యాలయాలను అప్పగించాల్సిందే
ఉమ్మడి రాజధానిని పొడిగించాలని ఏపీ హైకోర్టులో పిల్
l వచ్చే ఏడాది నుంచి ప్రవేశాల్లో ఏపీ విద్యార్థులకు నో చాన్స్
హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): ఉమ్మడి రాజధానిగా హైదరా బాద్ను ప్రకటించి పదేళ్ల గడువు జూన్ 2తో ముగియనున్నది. ఈ క్రమంలోనే మరోసారి ఉమ్మడి రాజధాని అంశం తెరపైకి వచ్చింది. అన్ని రంగాల్లో మన వాటా మనకు దక్కుతుందనేలోపే ఏపీ మేధావుల వర్గం మరో డిమాండ్ను తెరపైకి తీసుకొస్తోంది. మరికొంత కాలం ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను కొనసాగించాలని వారు కోరుతున్నారు. దీనిపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. ఏపీ విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పులతోపాటు 9వ షెడ్యూల్లో పేర్కొన్న వివిధ పరిశ్రమలు, కార్పొరేషన్ల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని ఏపీ ప్రజల వాదన. ఈ నేపథ్యంలోనే కొంతకాలం వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను కొనసాగించాలంటున్నారు. ఆ దిశగా ఒక చట్టం రూపొందించేలా కేంద్ర హోంమంత్రిత్వశాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేయాలని గత మార్చి నెలలోనే ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది.
హైదరాబాద్లో ఏపీ కార్యాలయాలు
హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉండడంతో ఏపీ కార్యాలయాలు ఇక్కడ కొనసాగుతున్నాయి. జూన్ ఈ గడువు ముగియనుంది. ఆ తర్వాత తెలంగాణకు మాత్రమే హైదరాబాద్ రాజధానిగా ఉండనుంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కొన్ని భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించింది. మిగతా ఏపీ కార్యాలయాలను ఇక్కడే కొనసాగించుకోవాలంటే మాత్రం తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. లేక్ వ్యూ అతిథి గృహం, ఆదర్శ్ నగర్లోని హెరిటేజ్ బిల్డింగ్, లక్డీకాపూల్లోని సీఐడీ కార్యాలయాలు ఏపీ సర్కారు ఆధీనంలోనే ఉన్నాయి. దీంతో వీటిని ఏపీ ప్రభుత్వం ఖాళీ చేయాల్సి ఉంటుంది. లేదంటే వాటికి అద్దె చెల్లించాల్సి ఉంటుంది. అయితే వీటిని ఖాళీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వాన్ని ఏపీ ప్రభుత్వం గడువు కోరే అవకాశం ఉంది. మరి ఏపీ విజ్ఞప్తికి ఇక్కడి ప్రభుత్వం ఒప్పుకుంటుందా? లేదా? అని చూడాల్సి ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని కొంత గడువు కోరడంతో దాన్ని తెలంగాణ సర్కారు తిరస్కరించినట్లు తెలుస్తోంది.
మన సీట్లు మన విద్యార్థులకే!
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం గడువు ముగియనుండడంతో జూన్ 2 తర్వాత నుంచి ఏపీ విద్యార్థులు ఇక్కడ నాన్ లోకల్ కానున్నారు. ఏపీ నుంచి తెలంగాణకు వచ్చి చదువుకునే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. విభజన చట్టం ప్రకారం పదేళ్ల వరకు రెండు రాష్ట్రాల విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఉమ్మడి ప్రవేశాల (కామన్ అడ్మిషన్స్)ను పొందేందుకు వీలు కల్పించాల్సి ఉంది. అయితే ఈ నిబంధన జూన్ 2తో ముగియనుంది. ఇక మన సీట్లు మన విద్యార్థులకే దక్కనున్నాయి. ఈ విద్యాసంవత్సరానికి (జూన్ 2కి ముందే) మాత్రమే ఈ నిబంధన వర్తించనుంది. ఎందుకంటే జూన్ 2కు ముం దు వచ్చిన నోటిఫికేషన్లకు మాత్రమే ఏపీ విద్యార్థులకు అనుమతినివ్వనున్నారు. ఇప్పటికే టీఎస్ ఎప్సెట్, లాసెట్, ఐసెట్, బీఈడీ, పీజీఈసెట్ తదితర సెట్లకు నోటిఫికేషన్లు తె లంగాణలో వెలువడ్డాయి. వాటికి దరఖాస్తు ప్రక్రియ సైతం కొనసాగుతోంది.
వీటికి ఏపీ వి ద్యార్థులూ దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమ ంలో ఈ విద్యాసంవత్సరం మాత్రమే ఏపీ స్థానికత కలిగిన విద్యార్థులకు తెలంగాణ వి ద్యాసంస్థల్లో ప్రవేశాలకు అవకాశం దక్కనుం ది. ఈ పదేళ్లు ఏపీ విద్యార్థులు ఇక్కడి విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందారు. ఇకపై జూన్2 తర్వాత వెలువడే నోటిఫికేషన్లకు ఏపీ విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే నాన్లోకల్ కోటా లోనే ప్రవేశాలు పొందాల్సి ఉంటుందని జేఎన్టీయూ అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాలల్లో ఏపీ విద్యార్థులకు రిజర్వేషన్లు వర్తించవని ప్రభుత్వం గతంలో జీవోలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏపీ కూడా తెలంగాణను అనుసరిస్తూ ఏపీలోని కొత్త మెడికల్ కాలేజీల్లో అక్కడి విద్యార్థులకు మాత్రమే అడ్మిషన్లు కల్పిస్తూ జీఓను విడుదల చేశారు.




