ఫార్మా కంపెనీలో గాయపడిన కార్మికులకు అండగా ఉంటాం
సంఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్
ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
చిట్యాల,(విజయక్రాంతి): నోస్ ల్యాబ్ ఫార్మా కంపెనీలో గురువారం రాత్రి జరిగిన ప్రమాదంలో గాయపడిన ఇద్దరు కార్మికులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామ సమీపంలోని నోస్ ల్యాబ్ ఫార్మా పరిశ్రమలో గురువారం రాత్రి ప్రమాదవశాత్తు మంటలు రావడంతో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. ఫార్మ ల్యాబ్ డి బ్లాక్ లో ఖమ్మం కు చెందిన వెంకటేశ్వర్లు, చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంకు చెందిన లక్ష్మణ్ లు రాత్రి విధులు నిర్వహిస్తుండగా అక్కడ రియాక్టర్ వద్ద ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి మంటలు ఉదృతంగా రావడంతో ఆ వేడికి కార్మికులు గాయపడ్డారు.
వెంటనే అప్రమత్తమైన కంపెనీ సిబ్బంది, తోటి కార్మికులు గాయపడిన వారిని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని శుక్రవారం ఎమ్మెల్యే వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్తో కలిసి పరిశీలించారు. ఈ ఘటనలో ప్రమాదం జరిగిన బ్లాక్ను సందర్శించిన అధికారులు, సంఘటనకు గల కారణాలు మరియు అమలులో ఉన్న భద్రతా చర్యలపై ప్లాంట్ ఇన్చార్జిని ప్రశ్నించారు. ఉద్యోగుల భద్రత, బీమా సదుపాయాలు, కంపెనీ అనుమతులపై కూడా వివరాలు సేకరించారు.
ఇదిలా ఉండగా, స్థానికులు ల్యాబ్ సామర్థ్యానికి మించి ఉత్పత్తి జరుగుతోందని, కొత్త భవనాలకు సరైన అనుమతులు లేవని ఆరోపించారు. పరిసర ప్రాంత ప్రజలకు, ఉద్యోగులకు సరైన భద్రతా చర్యలు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, కంపెనీ నిర్లక్ష్యం తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వీరేశం స్పష్టం చేశారు. బాధితులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ ఆర్డీవో మేక అశోక్ రెడ్డి, చిట్యాల ఎమ్మార్వో విజయకుమార్, చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీత రమేష్, మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.




