24-06-2025 06:00:22 PM
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయాలి..
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి..
వనపర్తి టౌన్: 2025-26 ఆర్థిక సంవత్సరానికి వనపర్తి జిల్లాలో రూ. 5290.33 కోట్ల వార్షిక రుణ ప్రణాళికను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(District Collector Adarsh Surabhi) ప్రకటించారు. మంగళవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల సమన్వయ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రూ. 5290.33 కోట్ల వార్షిక రుణ ప్రణాళికను ప్రకట్టించారు. ఇది గత సంవత్సరం కంటే 928.67 కోట్లు అధికం, ఇందులో అత్యధికంగా రూ. 3982.31 కోట్లు వ్యవసాయ రంగానికి కేటాయించినట్లు తెలియజేశారు. యం.ఎస్.యం.ఈ కింద రూ.429.50 కోట్లు ప్రయారిటీ సెక్టార్ కింద విద్య, గృహ నిర్మాణానికి రూ. 193.77 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక ప్రకటించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... అతి తక్కువ డబ్బులతో అత్యధికంగా లబ్ది చేకూరే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష యోజన బీమాను జిల్లాలోని బ్యాంక్ ఖాతాలు ఉన్న ప్రతి ఒక్కరికి చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి బ్యాంకర్లను ఆదేశించారు. బ్యాంకర్లు సాధించిన లక్ష్యాల సమీక్ష సందర్భంగా జిల్లాలో ఆయా బ్యాంకులు చేసిన పి.యం జె జె బి వై, పి.యం.ఎస్.బి. వై బీమా పాలసీలపై కలెక్టర్ మాట్లాడుతూ... ప్రధానమంత్రి సురక్ష యోజన భీమా చేయించడానికి చెల్లించాల్సిన డబ్బులు సంవత్సరానికి కేవలం 20 రూపాయాలు మాత్రమే అని అదే ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి కి అయితే కేవలం 436 రూపాయలు కట్టడం వల్ల ప్రమాదవశాత్తూ ఏమైనా జరిగితే ఒక్కో భీమా పాలసీ నుండి 2 లక్షల రూపాయలు చొప్పున వస్తాయన్నారు.
కానీ బ్యాంకర్లు నిర్లక్ష్యం వల్ల ఖాతాదారులకు భీమా చేయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాతాదారులకు బ్యాంకర్లు అవగాహన కల్పించాలని, సంవత్సరానికి 20 రూపాయలు, 436 పెద్ద విషయం కాదన్నారు. జిల్లాలో 381786 ఖాతా దారులు ఉంటే పి.యం.జె జె బి వై కింద భీమా చేయించిన వారు కేవలం 78,607 మాత్రమే ఉన్నారని అందులోనూ రెన్యువల్ చేయించుకున్న వారు 62913 ఖాతాదారులు అని తెలిపారు. అదే పి.యం.ఎస్.బి.వై లో 199,995 మంది భీమా చేయించుకున్నారు. వచ్చే సమావేశం వరకు భీమా చేసిన వారి సంఖ్య గణనీయంగా పెరగాలని లేకుంటే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధికి చేసుకున్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించి రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. వ్యవసాయ రంగానికి రైతులకు రుణాలు ఉదారంగా ఇవ్వాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జి యాదయ్య, డిప్యూటీ రీజినల్ అధికారి మురళి కృష్ణ, చీఫ్ మేనేజర్ లోకేష్, లీడ్ బ్యాంక్ మేనేజర్ శివకుమార్, డి.ఆర్డీఓ పి.డి ఉమాదేవి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.