24-06-2025 06:03:28 PM
గద్వాల్ టౌన్: ప్రపంచంలోని దేశాలపై అమెరికా చేస్తున్న దురాక్రమణ విధానాలను ప్రజలు ముక్తకంఠంతో ఖండించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఉప్పేర్ నరసింహ(CPM District Committee Member Upper Narasimha) అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలో ఇరాన్ పై అమెరికా చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రపంచంలో సహజ వనరులు ఉన్న దేశాలపైన ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధిపత్యం చలాయించడానికి అమెరికా నిరంతరం దాడులకు పాల్పడుతూ దురాక్రమణ విధానాలను అనుసరిస్తున్నదని కేవలం ప్రపంచంపై ఆదిపత్యాన్ని చలాయించడానికి తన ఆయుధాల వ్యాపారాన్ని విస్తరించడానికి పాల్పడే ఇటువంటి ఆక్రమణ విధానాలను అందరు వ్యతిరేకించాలన్నారు.
యుద్దాల వల్ల ప్రపంచం వ్యాప్తంగా ప్రజల జీవనోపాదికి తీవ్ర విఘతం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేసారు. యుద్దాల వల్ల దేశంలో నిరుద్యోగం పెరిగి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ప్రపంచ శాంతి కోసం కమ్యూనిస్టులు చేసే పోరాటాలలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.