ఎంపీ మహేశ్పై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్
5 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసిన టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరావు
హైదరాబాద్, మార్చి 15 (విజయక్రాంతి): మొయినాబాద్ డ్రగ్స్ కేసులో పట్టుబడిన ఏపీలోని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్పై ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు.. ఎంపీకి నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న ఘటనపై 5 రోజుల్లో నివేదిక ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
అయితే అప్పటి వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. డ్రగ్స్ వంటి ఘటనల్లో ఎవరున్నా ఉపేక్షించబోమని చంద్రబాబు హెచ్చరించారు. మహేశ్ ఇచ్చే వివరణ ఆధారంగా అధిష్టానం చర్యలు తీసుకుంటుందని పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు.
నాపై ఆరోపణల్లో నిజం లేదు: ఎంపీ పుట్టా
డ్రగ్స్ ఘటనలో తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని ఎంపీ పుట్టా మహేశ్కుమార్ అన్నారు. ఆదివారం స్టేషన్ బెయిల్ నుంచి విడుదలైన అనంతరం ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తనకు ఎలాంటి దురలవాట్లు లేవని, ఏ తప్పూ చేయలేదని వెల్లడించారు.
తాను ఎలాంటి వ్యక్తినో ఏలూరు ప్రజలు, పార్టీ నేతలకు తెలుసన్నారు. మిత్రుడు పిలిస్తేనే మొయినాబాద్కు వెళ్లినట్టు పేర్కొన్నారు. మీడియాలో వచ్చిన కథనాలు నమ్మవద్దని, పోలీసు విచారణకు పూర్తిగా సహకరిస్తానని వీడియోలో చెప్పారు. పూర్తి వివరాలు త్వరలో ప్రజలకు వివరిస్తానని అన్నారు.




