22-01-2026 01:34:10 PM
తెలంగాణ స్వరాష్ట్రంగా అవతరించిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన సినీరంగ అవార్డుల ప్రదానోత్సవాన్ని ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ప్రారంభించిన సంగతి తెలిందే. రాష్ట్రం ఏర్పడినప్పటినుంచి పదేళ్లకుపైగా పెండింగులో ఉన్న అవార్డులను గత ఏడాది ఒకేసారి ప్రదానం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. 2014 నుంచి 2024 మధ్యకాలంలో విడుదలైన సినిమాలకు నిరుడు ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరిట సినీరంగ కళాకారులకు పురస్కారాల ప్రదానం జరిగింది. ఆ అవార్డుల కార్యక్రమాన్ని కొసాగిస్తూ ఈ ఏడాది సైతం గద్దర్ అవార్డులను అందజేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమాభివృద్ది సంస్థ తాజాగా ప్రకటించింది. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ద్వారా సర్టిఫికేషన్ పొందిన చిత్రాలకు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్–2025 ప్రదానం చేయనున్నట్లు సంస్థ తెలిపింది.
ఫీచర్ ఫిలిమ్స్, జాతీయ సమైక్యతపై ఫీచర్ ఫిలిమ్స్, పర్యావరణం, హెరిటేజ్, చరిత్ర, సామాజిక చైతన్యం, బాలల చిత్రాలు, చలన చిత్ర రంగంలో టెక్నీషియన్లు, డాక్యుమెంటరీ, షార్ట్ ఫిలిమ్స్,సినిమా రంగంపై బుక్స్ తదితర రంగాలలో ఈ అవార్డులు ప్రదానం చేయనున్నట్టు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వెల్లడించారు. ఇప్పటివరకు ఉన్న అవార్డు విభాగాలకు తోడు ఈసారి కొత్త విభాగాలను కూడా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. సామాజిక స్పృహను ప్రతిబింబించే చిత్రాలకు ‘ఉత్తమ సామాజిక సందేశ చిత్రం’ అవార్డు, ప్రత్యేక విభాగంలో డా. సి. నారాయణరెడ్డి అవార్డులను అందజేయనున్నామన్నారు.
ఈ గద్దర్ అవార్డులకు అర్హులైన నిర్మాతలు, ఇతర దరఖాస్తుదారులు అవార్డులకు సంబంధించిన దరఖాస్తు పత్రాలు, మార్గదర్శకాలను జనవరి 31, 2026 వరకు పొందవచ్చని, తగిన డాక్యుమెంట్లతో కూడిన ఎంట్రీల సమర్పణకు ఫిబ్రవరి 3, 2026 చివరి తేదీగా నిర్ణయించినట్లు తెలిపారు.ఈ అవార్డుల వివరాలకు https:/filmin.telangana.gov.in అనే వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. నిర్దేశిత మార్గదర్శకాలను పాటిస్తూ నిర్ణీత గడువులోపే దరఖాస్తులను సమర్పించాలని అర్హులైన నిర్మాతలను కోరారు.