20-08-2025 02:04:33 AM
హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి) : రాష్ట్రానికి రావాల్సిన ఎరువులపై పార్లమెంట్లో నిలదీద్దామంటే.. గల్లీలో లొల్లి చేయ డానికి ఉత్సాహం చూపే బీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో మోదీని ప్రశ్నించడానికి భయపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లకు మోదీ అంటే భయమా లేక భక్తా అంటూ మండిపడ్డారు. మోదీ అంటే బీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.
ఈమేరకు మంగళవారం ఎక్స్ వేదికగా సీఎం రేవంత్రెడ్డి ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఢిల్లీలో కొట్లాడాల్సిన సమయంలో ముఖం చాటేయడం సరికాదని హితవు పలికారు. రైతుల కోసం మోదీ సర్కార్పై ఒత్తిడి తెచ్చేందుకు కలిసి రావాల్సిన బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో పత్తాలేరని ఎద్దేవా చేశారు. పార్లమెంటలో ఎరువుల కొరతపై మోదీని బీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు.
తెలంగాణపై వివక్ష చూపించొద్దని, కేటాయించిన వాటా మేరకు రాష్ట్రానికి యూరియా సరఫరా చేయాలని కేంద్రాన్ని సీఎం రేవంత్రెడ్డి కోరారు. తెలంగాణ రైతాంగానికి అవసరం మేరకు యూరియాను తక్షణమే సరఫరా చేయాలని డిమాండ్ చేశా రు.
కేటాయించిన మేరకు రాష్ట్రానికి యూ రియా సరఫరా చేయకపోవడంతో తలెత్తుతున్న సమస్యలను కేంద్రమంత్రులకు కాంగ్రె స్ ఎంపీలు వివరించిన విషయాన్ని ఈ సం దర్భంగా సీఎం గుర్తు చేశారు. రైతుల సమస్యలపై పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ ఎంపీ లు ఆందోళన సాగిస్తున్నప్పటికీ కోటా మేర కు యూరియా విడుదల చేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.
మోదీ భజనలో కేంద్రమంత్రులు బిజీ
రాష్ట్ర రైతాంగానికి అండగా నిలవాల్సిన కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ మోదీ భజనలో బిజీగా ఉన్నారని విమర్శించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రాష్ట్రానికి 8.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించినప్పటికీ, ఇప్పటివరకు 5.32 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేయడం వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులపై కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాకు ఎంపీలు వినతిపత్రం సమర్పించారని సీఎం పేర్కొన్నారు. యూరి యా సరఫరా విషయంలో తాను స్వయంగా వివరించడంతో పాటు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా పలు దఫాలు గా కేంద్రానికి లేఖలు రాశారని తెలిపారు.