calender_icon.png 12 July, 2025 | 6:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహంకాళి జాతరకు ఏర్పాట్లు పూర్తి

12-07-2025 02:09:06 AM

భక్తుల రాకపై ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే తలసాని

సనత్‌నగర్ జూలై 11 (విజయక్రాంతి): - మహంకాళి జాతరకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మహంకాళి ఆలయ పరిసరాలలో వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.

అమ్మవారి వడిబియ్యం పోసేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో రావడంతో ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్  మాట్లాడుతూ బోనాల ఉత్సవాలు మన అందరి పండుగ అని, గొప్పగా జరుపుకుందామని కోరారు. బోనాల సందర్భంగా ఎంతో చరిత్ర కలిగిన మహంకాళి అమ్మవారి దర్శనం, బోనాలు సమర్పించేందుకు వివిధ ప్రాంతాల నుండి లక్షలాది మంది భక్తులు వస్తారని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

అమ్మ వారి ఆశీస్సులతో సంతోషంగా ఉండాలని భక్తులు మొక్కులు తీర్చుకుంటారని అన్నారు. ఆదివారం తెల్లవారు జామున 3 గంటల నుండే బోనాలు సమర్పిస్తారని పేర్కొన్నారు. భక్తులు క్యూ లైన్‌లో ఇబ్బందులు పడకుం డా పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాల ఏర్పాటు చేయడమే కాకుండా, వివిధ ప్రాంతాల నుండి అదనపు పోలీసు సిబ్బందిని రప్పిస్తున్నట్లు వివరించారు.

భక్తులకు త్రాగునీరు అందించేందుకు వాటర్ వరక్స్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయ పరిసరాలలో ని ప్రజలు రాకపోకలు సాగించేందుకు వీలుగా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. దక్కన్ మానవ సేవా సమితి, ఆర్య సమాజ్ వంటి పలు సంస్థలు వాలంటీర్ లుగా భక్తులకు సేవలు అందిస్తారని చెప్పారు.

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా గుర్తించి జరపాలని ఉమ్మ డి రాష్ట్రంలో డిమాండ్ ఉన్నదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర పండుగగా ప్రకటించి ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని గుర్తు చేశారు. బోనాల ఉత్సవాలను వైభవంగా జరపాలని దేవాదాయ శాఖ పరిధి లోని ఆలయాలే కాకుం డా ప్రయివేట్ దేవాలయాలకు కూడా ఆర్ధిక సహాయం అందించిన ఏకైక ప్రభుత్వం అన్నారు. ఇందుకోసం 15 కోట్ల రూపాయలను కేటాయించి ఖర్చు చేసినట్లు వివరిం చారు.

నాటి నుండి యధావిధిగా ఈ కార్యక్రమం కొనసాగుతున్న దని, నూతనంగా వచ్చిన ప్రభుత్వం కూడా కొనసాగిస్తుండటం పట్ల ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర పండుగగా ప్రకటించిన తర్వాతనే బోనాల ఉత్స వాల విశిష్టత మరింత పెరిగిందని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు గొప్పగా జరుపుకుంటున్నారని చెప్పారు. ఏర్పాట్ల విషయంలో తాను అధికారులతో పర్యవేక్షణ చేస్తున్నానని, ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ లు అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, అత్తిలి అరుణ గౌడ్, ఆలయ ఈవో మనోహర్ రెడ్డి, డాకు నాయక్, ఈఈ సుబ్రహ్మణ్యం, ఆశిష్, తహశీల్దార్ పాండు నాయక్, బ్రహ్మానందం, దుర్గాప్రసాద్, బీఆర్‌ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు కిషోర్, ఆకుల హరికృష్ణ, ఆంజనేయులు, శ్రీహరి, పబ్బా ప్రకాష్, సతీష్, విజయ్, గణేష్, మహేందర్, ప్రేమ్ కుమార్ తదితరులు ఉన్నారు.