12-07-2025 02:11:18 AM
హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)లో అవినీతి, ఆర్థిక అక్రమాలు కొత్తేమీ కాదని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) కార్యదర్శి గురువారెడ్డి ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం బహిరంగ లేఖ విడుదల చేశారు. ప్రతి ఏడాది హెచ్సీఏకు రూ. 70 కోట్ల నుంచి రూ. 80 కోట్ల నిధులను బీసీసీఐ విడుదల చేస్తుందని, అయినప్పటికీ రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనూ క్రికెట్ అభివృద్ధికి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.
టీసీఏ,హెచ్సీఏలు పరస్పర సహకారంతో పనిచేయాలని సరిగ్గా నాలుగేళ్ల క్రితం బీసీసీఐ నిర్దేశించిందని పేర్కొన్నారు. కానీ బీసీసీఐ ఆదేశాన్ని హెచ్సీఏ విస్మరించింద న్నారు. హెచ్సీఏ అవినీతి, అక్రమాలను వెలికితీయడంలో లోతైన దర్యాప్తు చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభా గం, శ్రీనివాస్రెడ్డి, రవికుమార్ రెడ్డి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కచ్చిత మైన దర్యాప్తు కారణంగానే అక్రమాలకు పాల్పడిన కీలక వ్యక్తులు అరెస్టు అయ్యారని స్పష్టం చేశారు.
అప్పటి పాలకుల ప్రమేయంతోనే
గత పదేళ్ల హయంలో పాలకుల చేతిలో జగన్మోహన్ రావు కీలుబొమ్మగా మారి హెచ్సీఏలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అవినీతి ఆరోపణలతో అరెస్టు అయిన జగన్మోహన్రావుకు ఇప్పటికీ కవిత, కేటీఆర్ మద్దతు ఇస్తున్నారని తెలిపారు. 2023 అక్టోబర్లో నిర్వహించిన హెచ్సీఏ ఎన్నికల సమయంలో జగన్మోహన్రావు అధ్యక్ష పదవికి అనర్హుడైనప్పటికీ అప్పటి పాలకులు ఎన్నికల అధికారిపై ఒత్తిడి చేశారని ఆరోపించారు.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కింద గుర్తింపు పొందిన సంస్థ అయిన హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్గా జగన్ పదవిలో ఉన్నాడన్నారు. జాతీయ క్రీడా ని యమావళి ప్రకారం ఒకే వ్యక్తి రెండు క్రీడా సంస్థల్లో పదవులు నిర్వహించలేరని, అయినప్పటికీ జగన్మోహన్ నామినేషన్ ఆమో దిచారని తెలిపారు. సస్పెండ్కు గురైన క్లబ్లను ఓట్లు వేయడానికి అనుమతించడంతో జగన్మోహన్ ఒకే ఓటుతో గెలిచారని గుర్తు చేశారు.
అంతేకాకుండా ఆసక్తి గల క్రికెటర్ల తల్లిదండ్రులను దోపిడీ చేయడం వరకు కొనసాగిందని వెల్లడించారు. ఇప్పుడు ఫోర్జరీ, ఆర్థిక మోసం కేసును నమోదు చేసే వరకు పరిస్థితి వచ్చిందని వివరించారు. ఐపీఎల్ టిక్కెట్లను బ్లాక్- మార్కెటింగ్ చేయడం, సామగ్రి ఖర్చులను పెంచడం, అభివృద్ధి నిధులను మళ్లించడం వంటి దుష్ర్పవర్తనలు కొనసాగుతున్నా బీసీసీఐకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
జట్టు ఎంపికల్లో అక్రమాలు
గత రెండేళ్లలో బీసీసీఐ రూ. 171 కోట్లు మంజూరు చేసినా మౌలిక సదుపాయాలలో, క్రికెట్ కార్యకలాపాలలో అభివృద్ధి జరుగలేదన్నారు. అయితే ప్రతి సంవత్సరం హెచ్సీఏ ఖాతాలను ఆడిట్ లు లేకుండానే ఆమోదిస్తున్నారని, బీసీసీఐ కూడా దీనిపై దృష్టి సారించడం లేదన్నారు. తద్వారా జట్టు ఎంపికల్లో అవినీతి, అక్రమాలు, ముడుపులు చోటుచేసు కున్నాయన్నారు.
హైకోర్టు, సుప్రీం కోర్టు కమిటీ సిఫార్సులను ఉల్లంఘించడం వంటివి యథేచ్ఛగా జరుగుతున్నాయని వివరించారు. క్రికెట్ కోసం ఉద్దేశించిన నిధులను వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించుకుంటున్నా రని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్సీఏ పదవిలో ఎవరు ఉన్నా అవినీతి మాత్రం ఆగడం లేదని తెలిపారు. బోర్డులో కొందరు నిజాయితీగా ఉన్నప్పటికీ వారు కూడా ప్రేక్షకపా త్ర పోషించేందుకే పరిమితమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.