సీతారామచంద్ర స్వామి కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి
ఇల్లందకుంట ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించిన ప్రణవ్
హుజురాబాద్,మార్చి26(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లాహుజురాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుంటలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో జరిగే కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చలవ పందిళ్ళు, త్రాగు నీటి వసతి కల్పించామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ తెలిపారు.
గురువారం ఇల్లందకుంట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ లక్ష్మి కిరణ్, హుజూరాబాద్ ఆర్డీఓ రమేష్,ఆలయ ఈఓ సుధాకర్, చైర్మెన్ రామారావు, డైరెక్టర్లు, స్థానిక అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కళ్యాణానికి సుమారు లక్ష మంది హాజరవుతారనీ అంచనా వేశామనీ, జమ్మికుంట నుండి ఇల్లందకుంట వరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్నారు.
జమ్మికుంట రైస్ మిల్లర్లు, కాటన్ మిల్లర్ల ఆధ్వర్యంలో ఉచిత మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అన్నదాన ఏర్పాట్లు చేస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కళ్యాణానికి మంత్రి పొన్నం హాజరై ప్రభుత్వం తరపున పట్టు వస్రాలు సమర్పిస్తారని తెలిపారు. కళ్యాణానికి వచ్చే వాహనదారులకు పార్కింగ్ సంబంధించి పోలీసు శాఖ అధికారులు ఇప్పటికే మార్కింగ్ ఇచ్చారని అందరి సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు,మండల అధ్యక్షుడు పెద్ది కుమార్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




