27 March, 2026 | 3:40 AM

దండం పెట్టి అడుగుతున్నా.. డంపింగ్ యార్డును తరలించండి

27-03-2026 01:45 AM

అసెంబ్లీలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

హుజురాబాద్,మార్చి26(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని సిర్సపల్లి గ్రామ శివారులో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ప్రతిపాదనను విరమించుకోవాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గురువారం అసెంబ్లీలోవిజ్ఞప్తి చేశారు. డంపింగ్ యా ర్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ అసెంబ్లీలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తన గళం వినిపించారు.

ప్రభుత్వ నిర్ణయాన్ని నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. హన్మకొండ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల నుండి చెత్తను హుజురాబాద్కు తరలించడం వల్ల ఇక్కడి పర్యావరణం తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందన్నారు. దీంతో వ్యవసాయ భూములు నష్టపోవడం, భూగర్భ జలాలు కలుషితం కావడం, అలాగే ప్రజలకు అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. హుజురాబాద్ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటును విరమించుకోవాలని చేతులు జోడించి నమస్కరిస్తూ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. అలాగే, కందుగుల, కనుకుల గిద్ద, జూపాక రోడ్డు మరమ్మత్తులు జరిపించాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కోరారు.