15-12-2025 07:33:23 PM
హనుమకొండ (విజయక్రాంతి): ఈ నెల 17న జరగనున్న మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది మూడవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు శివ కుమార్ నాయుడు, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరిష్ ల సమక్షంలో సోమవారం నిర్వహించారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించారు. ఈ ప్రక్రియను సాధారణ పరిశీలకులు, కలెక్టర్ లు నిశితంగా పరిశీలించారు.
జిల్లాలోని ఆత్మకూర్, దామెర, నడికూడ, శాయంపేట మండలాల వారీగా ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓ.పీ. ఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. జిల్లాలో మూడవ విడతలో గల 68 గ్రామ పంచాయతీల సర్పంచ్, 634 వార్డు స్థానాలకు ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 626 ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించడం జరిగింది. ర్యాండమైజేషన్ ప్రక్రియలో డిఆర్డిఓ మేన శ్రీను, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, జెడ్పి సీఈఓ రవి, తదితరులు పాల్గొన్నారు.