బిక్షాటనతో ఆశా కార్యకర్తల నిరసన
మహబూబాబాద్, మార్చి 25 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు గత కొద్దిరోజులుగా వివిధ రూపాల్లో ఆందోళన చేస్తుండగా, బుధవారం మరిపెడ మండల ఆశ వర్కర్లు బిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆశాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుందని ఆరోపించారు.
ప్రజల ఆరోగ్యం కాపాడడం కోసం క్షేత్రస్థాయిలో నిత్యం వెట్టిచాకిరి చేస్తున్న తమకు కనీస వేతనం 18 వేలు అమలు చేయాలన్నారు. సీనియర్ ఆశాలను ఏఎన్ఎంలుగా నియమించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం మరిపెడ ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి, తాసిల్దార్ కృష్ణవేణి, మండల వైద్యాధికారి డాక్టర్ గుగులోత్ రవికి వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు ఉపేంద్ర, సునీత, శైలజ, స్వరూప, హాసియ, రమా, గణిత, జమున, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.




