22-06-2025 04:49:40 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆశా వర్కర్లకు స్థిర వేతనం నెలకు రూ. 26 వేలు ఇవ్వాలని, పెట్టుబడిదారుల లాభాల కోసం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలనే డిమాండ్లతో జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెలో ఆశాలు పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్(CITU) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాసు మాధవి(President Kasu Madhavi) కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలో జగన్నాధం భవనంలో ఆశా యూనియన్ జిల్లా కమిటీ సమావేశం ఉపేంద్ర అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో మాధవి మాట్లాడుతూ... కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పెట్టుబడి దారులు, కాంట్రాక్టర్ల ప్రయోజనాలు, లాభాల కోసం కార్మికులను కట్టు బానిసలుగా తయారు చేసేందుకే ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లను తెచ్చిందని తెలిపారు. లేబర్ కోడ్ ల అమలులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనిమిది గంటల నుండి పన్నేండు గంటలకు పనిని పెంచి కార్మిక హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు.
అనేక సంవత్సరాలుగా ప్రజలకు వైద్య సేవలందిస్తున్న ఆశాలను కార్మికులుగా గుర్తించాలని, స్థిర వేతనం నెలకు 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమాదకరమైన లేబర్ కోడ్ లను రద్దు, కార్మిక హక్కుల పరిరక్షణతో పాటు కనీస వేతనాల అమలు, ఉద్యోగ భద్రత, నిత్యవసర వస్తువుల ధరలు తగ్గిచాలని జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో జిల్లాలోని ఆశా వర్కర్లు ఐక్యంగా కదిలి జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు హసీనా, స్వరూప, రేణుక, కరుణ, చంద్రకళ, నిర్మల, రాధ, జ్యోతి, నీలా, సునీత పాల్గొన్నారు.