సికింద్రాబాద్ మారేడ్పల్లిలో దారుణం
గంజాయి మత్తులో యువకుడు మర్డర్
సికింద్రాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): సికింద్రాబాద్ లోని మారేడ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సంజీవయ్య నగర్కు చెందిన శ్రవణ్ అనే వ్యక్తిని అతని స్నేహితుడు నిఖిల్ దారుణంగా హత్య చేశాడు. పోలీసులు,స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఈస్ట్ మారేడుపల్లి పరిధిలోని సంజీవయ్య నగర్కు చెందిన శ్రావణ్(24) అనే యువకుడు ఫ్లవర్ డెకరేటర్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో అదే ప్రాంతంలో నివసించే నిరుద్యోగి సాయి నిఖిల్ (22) అనే యువకుడితో శ్రావణ్కు ఘర్షణ జరిగింది.
ఈ క్రమంలో తీవ్రమైన మద్యం మత్తులో ఉన్న సాయి నిఖిల్ ఒక్కసారిగా కత్తితో శ్రావ్ప దాడికి తెగబడ్డాడు. కత్తితో ఐదారు సార్లు విచక్షణారహితంగా పొడవడంతో శ్రావణ్శరీరంలో పలుచోట్ల తీవ్రమైన రక్తగాయాలయ్యాయి.ఈ ఘోరాన్ని గమనించిన రవి అనే వ్యక్తి వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించాడు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్ర రక్తస్రావంతో పడివున్న శ్రావణ్ను చికిత్స నిమిత్తం వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే డాక్టర్లు పరిక్షీంచి, చనిపోయినట్లు డిక్లేర్ చేశారు. ఈ దాడికి పాల్పడిన వారిని సాయి నిఖిల్తో పాటు నందు అనే మరో యువకుడిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. పాత కక్షలతోనే ఈ హత్య జరిగినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న మారేడుపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.






