08-11-2025 01:11:02 AM
వికారాబాద్, నవంబర్- 7(విజయక్రాంతి): ఓ బాలికను ఆటోడ్రైవర్ అడవిలోకి తీసుకెళ్లి, లైంగికదాడి చేసిన ఘటన శుక్రవారం వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలంలో చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన బాలిక శంకర్పల్లిలోని ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ 10వ తరగతి చదువుతుంది. ఇటీవల ఇంటికి వచ్చిన బాలిక శుక్రవారం తిరిగి వసతి గృహానికి వెలుతుంది.
గ్రామం నుంచి వాహనాలు ఏమీ లేకపోవడంతో అదే గ్రామానికి చెందిన వాహిద్ ఆటోలో బాలికను తల్లిదండ్రులు ఎక్కించారు. మోమిన్ పేట మండలం దేవరంపల్లి అడవుల సమీపంలోకి రాగానే ఆటోను అడివిలోకి తీసుకెళ్లిన వాహిద్ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. మోమిన్ పేట పీఎస్కు చెందిన బ్లూ కోర్టు పోలీసులు గస్తీ నిర్వహిస్తుండగా దేవరంపల్లి అటవీ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఆటోను గుర్తించారు.
అనుమానం వచ్చి ఆటోలో ఉన్న శేఖర్ను ప్రశ్నించారు. కొద్ది దూరంలోనే బాలికపై వాహిద్ అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. బాధిత బాలికను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది.