10-12-2025 08:09:04 PM
హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆటో డ్రైవర్లకు ఆత్మీయ భరోసా కార్యక్రమం బుధవారం జరిగింది. ఆటో డ్రైవర్ల ఇన్సూరెన్స్ (ప్రమాద బీమా) బాండ్ల పంపిణీ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఆటోడ్రైవర్ లు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ దీక్ష సమయంలో ఉద్యమంలో పాల్గొన్న సబ్బండ వర్గాల్లో ఆటోడ్రైవర్ లు కూడా ముందుండి పోరాడారన్నారు.
దేశంలో రైతులకు బీమా ఇచ్చిన నాయకుడు కేసీఆర్ ఒక్కడే అని, గీతన్నలకు, నేతన్నలకు బీమా ఇచ్చిన నాయకుడు కార్మిక పక్షపాతి కేసీఆర్ అని కేటీఆర్ పేర్కొన్నారు. రెండేళ్ళలో మార్పు మార్పు అంటూ మోసం ఎలా ఉంటుందో అందరికీ అర్దం అయిందని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మష్రత్ అలీ ఆటోలో ఎక్కి హామీలు ఇచ్చిండని, నేడు అలీ రెండు ఆటోలు అమ్ముకుని, కిరాయి ఆటో నడుపుకుంటుండని ఎద్దేవా చేశారు. రైతులకు రుణమాఫీ చేశామని దేవుళ్ళపై అబద్ధపు ఒట్లు పెడుతున్నారు.
420 హామీలు ఇచ్చి రాష్ట్రంలో అందరిని మోసం చేశారని, నెలకు వెయ్యి చొప్పున, రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు రెండేళ్లకు రూ.1560 కోట్లు అప్పు పడారని కేటీఆర్ వెల్లడించారు. జిల్లాలో అన్నిరకాల వాహనాల డ్రైవర్లకు సంక్రాంతి వరకు బీమా కల్పిస్తున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల వరకు ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు పెట్టకుంటే, హైదరాబాద్ లో మహాధర్నా చేద్దామని, కాంగ్రెసోడు ఊరికే ఇవ్వడు, గల్లా పట్టి అడిగితేనే ఇస్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్లకు రూ.10 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.