25-09-2025 12:47:33 AM
కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, సెప్టెంబర్ 24 ( విజయక్రాంతి ) : ప్రధానమంత్రి ఆవాస్ యోజన సర్వే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. వనపర్తి జిల్లాలో ప్రధా నమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ సర్వే పై మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుండి ఎంపీడీఓలు, ఎంపీఓ లు, పంచాయతీ సెక్రటరీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల కొరకు ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా దరఖాస్తు చేసుకున్న కుటుంబాల నుండి ఎల్ (1) కేటగిరిలో ఉన్న వారి వివరాలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆన్లైన్ డాటా పూర్తి చేయాల్సి ఉంది.
పంచాయతీ సెక్రెటరీలు క్షేత్ర స్థాయిలో ఇంటింటికి తిరిగి ఇందిరమ్మ ఇంటి కొరకు దరఖాస్తు చేసుకున్న కుటుంబాల వివరాలు సేకరించి ఆన్లైన్ చేయాల్సి ఉందన్నారు. వనపర్తి జిల్లాలో ఎల్ (1) కింద 39,643 కుటుంబాలు ఉన్నాయి. ఇందులో కనీసం 27,205 కుటుంబాల వివరాలు అప్లోడ్ చేయాల్సి ఉంది. ఇందులో ఇప్పటివరకు 33 శాతం మాత్రమే పూర్తి కావడం పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల ప్రత్యెక అధికారులు ప్రధానమంత్రి ఆవాస్ యోజన సర్వే పై ప్రత్యేక దృష్టి సారించాలని, గడువులోపల సర్వే పూర్తి అయ్యేవిధంగా చూడాలని ఆదేశించారు. రేపటి నుండి రోజు వారిగా సర్వే రిపోర్టు పంపించాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య, పి.డి. డీఆర్డీఓ ఉమా దేవి, పి.డి. హౌసింగ్ విటోభ, ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓ లు, ఎంపీఓ లు, పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు.