23-07-2025 12:00:00 AM
చిన్నకోడూరు, నారాయణరావు పేట మండలంలో పర్యటించిన శాస్త్రవేత్తలు
సిద్దిపేట రూరల్, జూలై 22: పట్టు రైతుల అభివృద్ధికి ఉపయోగకరమైన పద్ధతులపై సెంట్రల్ సిల్క్ బోర్డ్ ఆదేశాలతో ఉద్యానవ శాఖ అధికారులు బేస్ లైన్ సర్వే చేశారు. మంగళవారం చిన్నకోడూరు మండలంలోని చందలాపూరూ, నారాయణరావుపేట మండలంలోని గోపులాపూర్, జక్కాపూర్ గ్రామాల్లో సెంట్రల్ సిల్క్ బోర్డు శాస్త్రవేత్తలు వినోద్ కుమార్, రాఘవేంద్ర, పట్టు పరిశ్రమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఇంద్రసేనారెడ్డి, పట్టు పరిశ్రమ జిల్లా అధికారి రేణు శర్మ లు పర్యటించి పట్టు పంట సాగు రైతుల ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బేస్ లైన్ సర్వేకు సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి జిల్లాలు ఎంపిక అయినట్లు తెలిపారు. పట్టు రైతులు ఇంకా ఆర్థికంగా నిలుదొక్కుకునేందుకు టెక్నాలజీని ఎలా వినియోగించుకోవాలి, ఆధునికతను ఎలా అందిపుచ్చుకోవాలి, పట్టు సాగులో ఎలాంటి మెలకులు తీసుకోవాలని రైతులతో చర్చించారు. అధిక ఆదాయం ఉన్న ఈ సాగులోకి కొత్త రైతులను ఎలా ప్రోత్సహించాలనే విషయాలపై మాట్లాడారు.
అనంతరం పట్టు తోటల సాగు, షెడ్లలో పట్టుపురుగుల పెంపకం విధానాన్ని పరిశీలించి రైతులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పట్టు రైతుల సంఘం అధ్యక్షుడు పెద్దోళ్ల ఐలయ్య, పిల్లి శ్రీనివాస్, బి.నర్సింలు, ఎల్లయ్య, మహేష్, రైతులు పాల్గొన్నారు.