28-06-2025 11:41:59 PM
ఆందోళన చెందుతున్న చద్మల్ తండావాసులు
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో ఎలుగుబంటి సంచారం కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. గాంధారి మండలంలోని చద్మల్తండా శివారులోని అడవిలో ఎలుగుబంటి కనిపించిందని గ్రామస్థులు పేర్కొన్నారు. గాంధారి నుంచి నిజామాబాద్కు మంచిప్ప మీదుగా వెళ్లే మార్గంలో దట్టమైన అటవీప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో తరచూ ఎలుగుబంట్ల జాడలు కనిపిస్తాయని గ్రామస్థులు పేర్కొంటున్నారు. తాజాగా చద్మల్తండా శివారులో ఎలుగుబంటి కనిపించడంతో కొందరు బైక్పై వెళ్లే వ్యక్తులు వీడియోలు తీసి సామాజిక మాద్యమాల్లో పోస్ట్ చేశారు. ఆ మార్గం నుంచి ఎలుగుబంట్లు బయటకు రాకుండా అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఎలుగబంటి సంచారిస్తుందని సామాజిక మాద్యమాల్లో వీడియో వైరల్ కావడంతో చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో అడవి గుండా వెళ్లాలంటేనే ప్రయాణికులు జంకుతున్నారు.
గతంలోనూ ఎలుగుబంటి ఆనవాళ్లు..
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం చద్మల్తండా శివారులోని అడవిలో కొన్నేళ్ల క్రితం ఎలుగుబంటి ఆనవాళ్లు కనిపించాయని గ్రామస్థులు పేర్కొన్నారు. తునికాకు కోసేందుకు కొంతమంది అడవుల్లోకి వెళ్లగా ఎలుగుబంట్లను చూసి వారు వెనక్కి వచ్చిన సందర్భాలున్నాయి. అయితే అడవిలో ఉండాల్సిన ఎలుగుబంట్లు జనావాసాల్లోకి వస్తే ఇబ్బందులు వస్తాయని.. వాటిని కట్టడి చేయాలని గ్రామస్థులు అటవీశాఖాధికారులకు విన్నవిస్తున్నారు.