calender_icon.png 25 June, 2025 | 11:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలు పొందిన లబ్ధిదారులు త్వరగా ఇల్లు నిర్మించుకోవాలి

25-06-2025 07:01:10 PM

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి

పాన్గల్ గ్రామ పంచాయతీ ఎస్సీ కాలనీ అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు అక్షరాభ్యాసం 

పదవ తరగతి విద్యార్థులకు లెక్కలు నేర్పించిన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి..

వనపర్తి (విజయక్రాంతి): వనపర్తి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పొందిన లబ్ధిదారులు తమ ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(District Collector Adarsh ​​Surabhi) సూచించారు. బుధవారం పాన్గల్ మండలంలోని మాధవరావు పల్లి గ్రామపంచాయతిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. గ్రామానికి 57 ఇళ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 36 ఇళ్లకు ముగ్గులు పోసి 17 ఇళ్లు స్లాబ్ వరకు పూర్తి అయ్యాయి. ఇళ్లను పరిశీలించిన కలెక్టర్ సంతృప్తిని వ్యక్తం చేశారు. మిగిలిన వాళ్ళు నిర్మాణం ప్రారంభించలేదు కాబట్టి వారికి రద్దు చేసి అర్హత ఉన్న ఇతరులకు సిఫారసు చేయాలని మండల అభివృద్ధి అధికారిని ఆదేశించారు. అనంతరం మాధవరావు పల్లి ప్రాథమిక పాఠశాలను సందర్శించారు.

పాఠశాలల్లో ఒకే ఉపాధ్యాయుడు ఉన్నప్పటికినీ విద్యార్థులకు నాణ్యమైన విద్యాబుద్ధులు నేర్పిస్తూ ప్రతి సంవత్సరం 5వ తరగతిలో గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు పొందేవిధంగా చూడటంపై ఉపాధ్యాయుడు వీరస్వామినీ కలెక్టర్ అభినందించారు. అంతకు ముందు పానగల్ గ్రామము ఎస్సీ కాలనీ అంగన్వాడి కేంద్రంలో కొత్తగా చేరిన విద్యార్థులకు కలెక్టర్ అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం పానగల్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాను సందర్శించారు. 5వ తరగతి వరకు ఉన్న పాఠశాలలో 105 మంది విద్యార్థులు ఉండటం ఇంగ్లీష్ మీడియం ద్వారా నేర్చుకున్న పాఠాలను విద్యార్థులు చక్కగా చెప్పడం పై కలెక్టర్ అభినందించారు.

ఉపాధ్యాయులు అంకిత భావంతో విద్యా బోధనలు చేస్తే ఇలాంటి మంచి ఫలితాలు వస్తాయని కలెక్టర్ ఉపాధ్యాయులను ప్రోత్సహించారు.  విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి పెట్టడం, ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడటం, ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యాయులు కలెక్టర్ కు వివరించారు. ఉపాధ్యాయుడు వెంకటేష్ ను సైతం కలెక్టర్ అభినందించారు. అనంతరం పానగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. గత సంవత్సరం 10 వ తరగతిలో ఎంతమంది విద్యార్థులు పరీక్షలు రాశారు? ఎంతమంది ఉత్తీర్ణత సాధించారు? పరీక్షలు రాసిన  అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు అని ఉపాధ్యాయులను ప్రశ్నించారు.

అమ్మాయిలకు బాల్య వివాహాలు చేసే ప్రమాదం ఉంటుందని అందువల్ల ప్రతి అమ్మాయి జూనియర్ కళాశాలలో చేరే విధంగా చూడాలని సూచించారు.  అనంతరం పదవ తరగతి అమ్మాయిలకు డిజిటల్ బోర్డు పై  లెక్కలు నేర్పించారు.  విద్యార్థులు అందరికీ అర్థమయ్యే వరకు లెక్కలు ఎలా చేయాలి, లాజిక్ ఎలా అర్థం చేసుకోవాలి అని బోధించారు. ఈ పాఠశాల నుండి మ్యాథమాటిక్ లో ఒక్క విద్యార్థి ఫెయిల్ కాకుండా విద్యా బోధన చేయాలని ఆదేశించారు. జిల్లా విద్యా అధికారి మహమ్మద్ అబ్దుల్ ఘని, పి.డి డిఆర్డీఒ ఉమాదేవి, జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, తహసిల్దార్ సత్యనారాయణ, ఎంపీడీఓ గోవింద రావు, మండల విద్యా అధికారి శ్రీనివాస్, ఉపాధ్యాయులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.