18-07-2025 12:00:00 AM
గాంధీ ఆసుపత్రిని సందర్శించిన ఇందిరాశోభన్
రంగారెడ్డి, జులై 16: ప్రజా ప్రభుత్వంలో నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని మరోసారి రుజువైందని ఆ పార్టీ సీనియర్ నాయకురాలు ఇందిరాశోభన్ అన్నారు. బుధవారం గాంధీ ఆసుపత్రిని ఆమె సందర్శించారు. ఆయా వార్డులకు స్వయంగా వెళ్లి, చికిత్స పొందుతున్నపేషంట్లను పరామర్శించారు.
ఆసుపత్రిలో అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది పనితీరు ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. గాంధీ ఆసుపత్రి వైద్య సేవలపై రోగులు సంతృప్తి వ్యక్తం చేశారు. వైద్యులు సకాలంలో చికిత్స చేస్తున్నారని, సిబ్బంది సరైన సమయానికి మందులు అందిస్తున్నారని రోగులు తెలిపారు.
అనంతరం.. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న గాంధీ ఆసుపత్రి వైద్య సిబ్బందిని ఇందిరా శోభన్ అభినందించారు. ఆసుపత్రి ఆర్ఎంఓ యుగంధర్ను కలిసి రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు పోతుగంటి నరేందర్ తదితరులు పాల్గొన్నారు.