24-04-2025 12:35:52 AM
కలెక్టర్ రాహుల్ రాజ్
చేగుంట, ఏప్రిల్ 23 : భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన ఆర్వోఆర్ భూ భారతి చట్టం రూపకల్పన చేసిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. చేగుంట మండలంలోని రైతు వేదిక వద్ద నిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఆర్డిఓ జయచంద్ర రెడ్డి తో కలిసి పాల్గొన్నారు. భూ భారతి చట్టం లోని వివిధ అంశాలను కలెక్టర్ రైతులకు, ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన భూ భారతి (రికార్డు ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్) చట్టం 2025 అమల్లోకి వచ్చిందని, ముందుగా రాష్ట్రంలోని 4 మండలాలలో పైలెట్ ప్రాజెక్టు కింద ఈ చట్టం అమలు చేస్తున్నారని, ఈ చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు జిల్లాలో ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 28 వరకు ప్రతి మండల కేంద్రంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలన అధికారులను నియమించేందుకు చర్యలు తీసుకుంటుందని అన్నారు.