13 April, 2026 | 9:53 PM

భూ పరిపాలనకు కొత్త దిక్సూచి భూభారతి

13-04-2026 08:45 PM

చరిత్రాత్మక  చట్టానికి రేప‌టితో ఏడాది పూర్తి

ఖమ్మం,(విజయక్రాంతి): భూహక్కుల పరిరక్షణ, పారదర్శకత, అవినీతి రహిత సేవలు  సామాన్యుడికి సులభంగా అందేలా గ‌త ఏడాది రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తెచ్చింది. సోమవారం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రజా ప్రభుత్వం చారిత్రాత్మకంగా తీసుకువచ్చిన భూభారతి చట్టం రేపటితో ఏడాది పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను బంగాళాఖాతంలో క‌లుపుతామ‌ని ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకొని, గ‌త ఏడాది ఏప్రిల్ 14న డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ జ‌యంతి రోజున గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిగారి చేతుల మీదుగా భూభార‌తి పోర్ట‌ల్‌ను ఆవిష్కరించడం జరిగింది.

పోర్టల్ ప్రారంభించిన ఏడాది వ్యవధిలో  3.80 లక్షల పాస్ బుక్ లు జారీచేశాం. పోర్టల్ ప్రారంభించిన ఏడాదిలోపే 5.20 కోట్లకు పైగా ప్ర‌జ‌లు ఈ పోర్ట‌ల్‌ను సంద‌ర్శించగా సుమారు 67 ల‌క్ష‌ల మంది పోర్ట‌ల్‌ ద్వారా లాగిన్ అయ్యారు. భూ వివాదాలకు చరమగీతం పాడుతూ ఈ 12 నెలల కాలంలో పాత చిక్కుముడులను విప్పడంలో భూభారతి పోర్టల్ కీలక పాత్ర పోషించింది. రెవెన్యూ, సర్వే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ రూపొందించిన ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ సేవలు ఏప్రిల్ 2న 5 జిల్లాలోని 5 మండలాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించాం. ఈ ఐదు మండలాల్లోని ప్రతి సర్వే నెంబరుకు భూధార్ నెంబర్ కేటాయించడం జరుగుతుంది.

రాష్ట్రంలో నిజాం కాలం నుంచి 378 గ్రామాల‌ను నక్షాలు లేవు. ఇందులో ఇప్పటికే ఐదు గ్రామాలలో రీ సర్వే పూర్తి చేసి భూదార్ నెంబర్ కేటాయించడం జరిగింది. పాత‌స‌ర్వే ప‌ద్ద‌తుల‌కు స్వ‌స్తి పలుకుతూ ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాలను గుర్తించి రోవర్లతో భూ సర్వే చేయనున్నాం. ఇప్పటికే 411 రోవ‌ర్లను కొనుగోలు, త్వర‌లో మ‌రో 400 కొనుగోలు చేయ‌బోతున్నాం. తెలంగాణ ప్రాంతంలో 1948 నాటికి సుమారు 40 ల‌క్షల స‌ర్వేనెంబ‌ర్లు వినియోగంలో ఉండ‌గా అప్పటి నుంచి ఇప్పటి వ‌ర‌కు ఆ సంఖ్య 2కోట్ల 29 ల‌క్షల‌కు చేరింది. భూవిస్తీర్ణాన్ని బ‌ట్టి  ప్రతి మండ‌లానికి  నాలుగునుంచి ఆరుగురు సర్వేయ‌ర్లను, రాష్ట్రంలోని 10,984 రెవెన్యూ గ్రామాల‌ను క్ల‌స్ట‌ర్లుగా విభ‌జించి జీపీవోల‌ను  నియ‌మించ‌డం జ‌రిగింది. పార‌ద‌ర్శ‌క‌త‌, బాధ్య‌తాయుత‌, వేగం అనే మూడు ప్రధాన సూత్రాల‌తో ప్రజాప్రభుత్వం రెవెన్యూ వ్య‌వ‌స్ధ‌ను పునర్నిర్మిస్తూ ప్రజలకు చేరువ చేస్తోంది.