22-08-2025 11:06:06 AM
హైదరాబాద్: సేవ్ హైదరాబాద్(Save Hyderabad) పేరుతో సచివాలయం ముట్టడికి భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) పిలుపునిచ్చింది. గ్రేటర్లో సమస్యలు పరిష్కరించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. దీంతో బీజేపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేస్తున్నారు. సచివాలయం వైపు దూసుకెళ్లేందుకు సరూర్ నగర్ కార్పొరేటర్ అకుల శ్రీవాణి(Corporator Akula Srivani) ప్రయత్నించారు. శ్రీవాణితో పాటు పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీవాణి మీడియాతో మాట్లాడుతూ... ప్రజా పాలన అంటూ ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి(Revanth Reddy) తెలంగాణకు అవసరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ పర్యటనలకే పరిమితమైన సీఎం తెలంగాణకు వద్దని మండిపడ్డారు. పురపాలక శాఖ మంత్రిగా కమిషన్లకే పనిచేసే రేవంత్ రెడ్డి తెలంగాణకు అవసరం లేదని తేల్చిచెప్పారు. ప్రజల కోసం – తెలంగాణ కోసం బీజేపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. శుక్రవారం నాడు పలువురు బీజేపీ నేతలు, కార్పొరేటర్లను పోలీసులు గృహ నిర్భందం చేశారు. తుర్కయాంజల్ లో బీజేపీ(BJP) నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని అబ్దుల్లాపూర్ మెట్ పీఎస్ తరలించారు. జీహెచ్ఎంసీలో సమస్యల పరిష్కారం కోరుతూ నేతలు సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు.