పీఎండీడీకేవై అమలు సరిగా లేదు!
వెంటనే నిధులు మంజూరు చేయాలి
కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన బీజేపీ ఎంపీ డీకే అరుణ
హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): తెలంగాణలోని వెనుకబడిన జిల్లాల్లో పీఎం ధన కృషి యోజన (పీఎండీ డీకేవై) పథకం ఆశించిన స్థాయిలో అమలు కావడం లేదని బీజేపీ ఎంపీ డీకే అరుణ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి స్పష్టత ఇవ్వాలని ఆమె కోరారు.
తెలంగాణలో జోగులాంబ గద్వాల, నారాయణపేట, నాగర్కర్నూల్, జనగామలను కేంద్రం వెనుకబడిన జిల్లాలుగా గుర్తించిందని గుర్తు చేశారు. అయితే క్షేత్రస్థాయిలో ఈ పథకం అమలు కావడం లేదని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆయా జిల్లాలకు మేలు జరగాలంటే ఈ పథకంపై ప్రత్యేక దృష్టి సారించి, వెంటనే నిధులు మంజూరు చేసి పర్యవేక్షణ చేయాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.






