బిజెపి మతోన్మాదం యువత చైతన్యానికి ప్రతిబంధకం
వనపర్తి,(విజయక్రాంతి): బిజెపి హిందూ మతోన్మాదం యువత చైతన్యానికి ప్రతిబంధకమని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కేతూరు శ్రీరామ్ అన్నారు. పానగల్ మండలం తెల్లరాల్లపల్లిలో సిపిఐ గ్రామ శాఖ ఆధ్వర్యంలో మేడే వారోత్సవాల సందర్భంగా మాజీ ఉపసర్పంచ్ కాటం బాలస్వామి అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పల్లెలు పట్టణాల్లో నిరుద్యోగ పేద బడుగు బలహీన వర్గాల యువతను హిందూ మతం పేరుతో, డబ్బు తాగుడు ప్రలోభాలు పెట్టి ఆకర్షిస్తోందన్నారు.
నిరుద్యోగం పేదరికంపై ప్రశ్నించి, పోరాడకుండా మభ్యపెడుతుందన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ చెప్పి అధికారంలోకి వచ్చి లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని, ప్రతి రైతు ఖాతాలోరూ. 15 లక్షలు జమ చేస్తామని చెప్పి మోసం చేసినా కర్మ సిద్ధాంతం చెప్పి తిరగబడకుండా చేస్తోందన్నారు. సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్, తెల్ల రాళ్లపల్లి మాజీ ఉపసర్పంచ్ బాలస్వామి, వార్డు సభ్యుడు గ్రామ శాఖ కార్యదర్శి సహదేవ్, మాజీ వార్డుసభ్యుడు కట్టెల బాల స్వామి, ఎర్రగుంట రాముడు, పరంధాములు, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.






