కంటి చూపుతోనే జీవితానికి వెలుగు
సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా
లక్ష్మీదేవిపల్లి, ఆగస్టు 26, (విజయక్రాంతి): కంటి చూపుతోనే మానవ జీవితానికి నిజమైన వెలుగు చేకూరుతుందని, దృష్టి లోపాలను నిర్లక్ష్యం చేస్తూ జగత్తును అంధకారం చేసుకోవద్దని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు.
ఫినిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్కు చెందిన శంకర కంటి ఆస్పత్రి వారి సహకారంతో లక్ష్మీదేవిపల్లి మండలం పునుకుడుచెలక జీపీ పరిధిలోని మర్రిగూడెం గ్రామంలో బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని సాబీర్ పాషా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. మానవ శరీరంలో కళ్ళు అత్యంత కీలకమైన భాగమని, కంటి చూపు లోపిస్తే నిత్య జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులు వర్ణనాతీతమని పేర్కొన్నారు.
మారుమూల గిరిజన పల్లెను ఎంచుకుని పేదల కోసం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయతోపాటు అవసరమైనవారికి ఉచిత ఆపరేషన్లు నిర్వహించేందుకు ముందుకురావడం అభినందనీయమన్నారు. ఫినిక్స్ ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు ఎంతో ఆదర్శనీయమన్నారు. కార్యక్రమంలో మేయర్ మూడ్ గణేష్, సీపీఐ నాయకులు దీటి లక్ష్మీపతి, జలీల్ పాషా, దారా శ్రీను, సర్పంచులు రాంబాబు, తాటి లక్ష్మణ్, ఉమ, మౌనిక, రాము తదితరులు పాల్గొన్నారు.






