calender_icon.png 20 November, 2025 | 1:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీఐపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్ దుష్ప్రచారం

19-11-2025 11:27:02 PM

పత్తి దిగుబడి ఎంత వచ్చినా సీసీఐ చేస్తుంది

రాష్ట్ర చీఫ్ రాంచందర్ రావు

హైదరాబాద్ (విజయక్రాంతి): కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు సీసీఐపై తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారం చేయడం సరికాదని, పత్తి దిగుబడి ఎంత వచ్చినా సీసీఐ మొత్తం కొనుగోలు చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిన్నింగ్ మిల్లుల ప్రతిపాదనలు పంపితే, కేంద్రం ఇప్పుడున్న 200 కొనుగోలు కేంద్రాలతో పాటు మరో 100 కొత్త కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తూ తెలంగాణ రైతులను తప్పుదారి పట్టిస్తోందన్నారు.

రుణమాఫీ అమలు కాకపోవడం వల్ల రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు తీర్చలేక తీవ్ర ఒత్తిడికి, ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. నల్లగొండ జిల్లా పుల్లెంల గ్రామానికి చెందిన ఒక రైతుతో పాటు మరోచోట రైతు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత విషాదకరమని చెప్పారు. మరోవైపు బీఆర్‌ఎస్ పార్టీ గతంలోని తమ పాలనా వైఫల్యాలను దాచేందుకు కేంద్రంపై అనవసర నిందలు మోపుతోందన్నారు. రైతులకు బేడీలు వేసి జైలుకు పంపించిన చరిత్ర బీఆర్‌ఎస్ పార్టీదన్నారు. తెలంగాణలో ఇప్పటికే 200కి పైగా కొనుగోలు కేంద్రాలు పనిచేస్తున్నాయని, కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కేవలం 70 కేంద్రాలు మాత్రమే ఉండేవని, ఇప్పుడు అవి మూడింతలు పెరిగాయని పేర్కొన్నారు. 

పంజాబ్‌లో ఎకరానికి 530 కిలోల దిగుబడి ఉంటే, హర్యానా రాజస్థాన్ గుజరాత్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక క్వింటాళ్లు నమోదయ్యాయని, కానీ తెలంగాణలో 12 క్వింటాళ్లు చూపించడం నమ్మశక్యంగా లేకపోవడం కొంత అనుమానాలకు దారితీస్తోందన్నారు. గత సంవత్సరం తెలంగాణలో ప్రతి ఎకరాకు 6.32 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చిందన్నారు. పత్తి కొనుగోళ్లలో, జిన్నింగ్ మిల్స్ విషయాల్లో తలెత్తిన ఇబ్బందులను తొలగించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. పత్తి మాయిశ్చర్ విషయంలో దేశవ్యాప్తంగా ఒకటే విధానాన్ని అమలు చేస్తున్నారని, తెలంగాణలో కూడా అదే పాలసీ అమల్లో ఉందన్నారు. భారతదేశం ఇప్పటికే లక్షల కోట్ల వస్త్ర ఎగుమతులు చేస్తోందని, దేశీయ తయారీని బలోపేతం చేసి, ప్రపంచ మార్కెట్‌ను విస్తరించేలా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.