calender_icon.png 14 June, 2025 | 5:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక పరిస్థితిని నాశనం చేసిన బీఆర్‌ఎస్

14-06-2025 01:30:38 AM

-బాగు చేస్తూ సంక్షేమ కార్యక్రమాల అమలు

- శాంతి భద్రతల నిర్వహణ కీలక అంశం

- మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

- ప్రజల కష్టాలు తీర్చేందుకు పోలీస్ స్టేషన్లు

- మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

- పెద్దపల్లి జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లు, అభివృద్ధి పనుల ప్రారంభం

పెద్దపల్లి, జూన్ 13 (విజయక్రాంతి)/ఎలిగేడు: గత బీఆర్‌ఎస్ హయాంలో పాలకులు నాశనం చేసిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బాగుచేస్తూ, అదే సమయంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని రెవె న్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఐటీ శాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి ఎలిగేడు మండలంలో నూ తన పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించారు. పెద్దపల్లిలో సమీకృత మార్కెట్ పనులకు శంకు స్థాపన చేశారు.

పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ వద్ద ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, రూరల్ పోలీస్ స్టేషన్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మహిళా పోలీస్ స్టేషన్‌లను మంత్రులు ప్రారంభించారు. అనంతరం చందన్‌పల్లి రాంపల్లి గ్రామంలో నిర్మించిన 466 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు మంత్రులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చందన్‌పల్లి గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలోమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గత పాలకులు విచ్ఛిన్నం చేసినప్పటికీ ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నదన్నారు. గత పాలకుల సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ అదనంగా నూతనంగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను ప్రజాప్రభుత్వం చేపట్టిందన్నారు.

గత ప్రభుత్వం తెచ్చిన ధరణి చట్టం వల్ల కేవలం పాలకుల కుటుంబ సభ్యులు మాత్రమే లబ్ధిపొందారని, అనేక మంది రైతులకు కన్నీళ్లు మిగిల్చిన ధరణి చట్టాన్ని రద్దు చేసి అద్భుతమైన భూ భారతి చట్టం తమ ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. అలాగే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందుతుందని, రాబోయే 4 సంవత్సరాల కాలంలో సుమా రు 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లను కట్టాలని ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. మండల ఏర్పాటుకు కృషిచేసిన నాయకుడు విజయరమ ణారావు పెద్దపల్లి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతే పోలీస్ స్టేషన్ వచ్చిందన్నారు. ని త్యం ప్రజలతో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో కృషి చేసే నాయ కుడు విజయరమ ణావు అని చెప్పారు. 

సమస్యలు తీర్చేందుకే పోలీస్ స్టేషన్: మంత్రి శ్రీధర్‌బాబు

సామాన్య ప్రజల సమస్యలు తీర్చేందుకే పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని ఐటీ శాఖ మంత్రి దుద్దుళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఎలిగేడు మండలం ఏర్పాటు చేసిన 24 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యే విజయరమణారావు కృషి ఫలితంగా నేడు పోలీస్ స్టేషన్ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉన్నదన్నారు. ముఖ్యమంత్రి హామీ మేరకు అత్యా ధునిక సదుపాయాలతో స్టేషన్ ఏర్పాటు చేశామన్నారు.

సామాన్య ప్రజలకు కష్టాలను పరిష్కరించే దిశగా పోలీస్ అధికారులు నేడు విధులు నిర్వహిస్తున్నారని, గ్రామ స్థాయి నుంచి పక్కాగా శాంతి భద్రతలు నిర్వహించేలా పోలీస్ వ్యవస్థ పని చేస్తుందని మంత్రి తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు రావాల్సిన పరిస్థితి ఎవరికి రావద్దని, సమస్యలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలను చుట్టాలుగా భావించి పోలీస్ సిబ్బంది పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ కోయ శ్రీహ ర్ష, ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఎమ్మెల్సీ భాను ప్రసాద్‌రావు, రామగుండం సీపీ అంబర్ కిషోర్, డీసీసీ కరుణాకర్, ఏసీపీ కృష్ణ, అదనపు కలెక్టర్లు డి వేణు, జే.అరుణశ్రీ, రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్ పాల్గొన్నారు.