19-06-2025 12:50:38 AM
బీఆర్ ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్
సూర్యాపేట, జూన్ 18 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చిన బిఆర్ఎస్ పార్టీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని బి ఆర్ ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. బుధవారం జిల్లా బి.ఆర్.ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామపంచాయతీ ఎన్నికలు కావాలని మొదటి నుంచి బిఆర్ ఎస్ కోరుతుందని అన్నారు.
ఎన్నికలే కాంగ్రెస్ కు చరమగీతం పాడేందుకు వేదిక కానున్నాయన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. కాళేశ్వరం విషయానికి వస్తే కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ ల వివరణలను తీసుకున్న గోష్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మినీట్స్ ఇవ్వాలని అడగగా నేటి వరకు ఇవ్వకుండా దాటవేస్తుందన్నారు.
కాంగ్రెస్ హామీలపై ప్రశ్నిస్తున్న బిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై 16 మాసాల్లో 15 కేసులు పెట్టి ప్రజలను రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. రైతంగానికి యాసంగి రైతు భరోసాను ఇవ్వకుండానే వానాకాలం రైతు భరోసాను ఎన్నికల స్టంట్ లో భాగంగా ఇస్తున్నారని అన్నారు.
ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు ఉప్పల ఆనంద్, జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, మాజీ ఎంపీపీ నెమ్మాది బిక్షం, మాజీ జెడ్పిటిసి జిడి బిక్షం, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మడిపల్లి విక్రమ్ తదితరులు ఉన్నారు.