వైద్యుల సేవలు వెలకట్టలేనివి
- గజ్వేల్ ప్రభుత్వ జిల్లా దావఖాన సూపరిండెంట్ డాక్టర్ రేఖారాణి
గజ్వేల్: వైద్యులు ప్రజల ప్రాణాలను కాపాడే దైవ స్వరూపులని, వారి సేవలు వెలకట్టలేనివని గజ్వేల్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రేఖారాణి అన్నారు. బుధవారం గజ్వేల్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రేఖారాణి మాట్లాడుతూ, అమ్మ జన్మనిస్తే వైద్యులు పునర్జన్మ ఇస్తారని, వైద్యో నారాయణో హరి అన్న మాటకు తగినట్టుగానే వైద్యులు భగవంతునితో సమానమైన సేవలను అందిస్తున్నారన్నారు. అపారమైన ఒత్తిడి, భావోద్వేగాలు, ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ వైద్యులు ఓర్పుతో సేవలందిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తమ జీవితాలను అంకితం చేస్తున్నారన్నారు.
వైద్యులు అవిశ్రాంత కృషి, త్యాగం, అంకితభావంతో సేవలందిస్తూ సమాజానికి అండగా నిలుస్తున్నారని, సమయం, పరిస్థితి, అలసటతో సంబంధం లేకుండా ప్రతి రోగి ఆరోగ్యమే లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిపారు. దేశంలో ప్రముఖ వైద్యుడు, పశ్చిమ బెంగాల్ రెండో ముఖ్యమంత్రి డాక్టర్ చంద్ర రాయ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, ఆయన వైద్య రంగానికి చేసిన విశేష సేవలు చిరస్మరణీయమని అన్నారు. అనంతరం ఆసుపత్రిలో సేవలందిస్తున్న వైద్యులను డాక్టర్ రేఖారాణి ఘనంగా సన్మానించారు. కేక్ కట్ చేసి వైద్యులతో కలిసి జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకున్నారు.






