బీఆర్ఎస్ను ఎదుర్కోలేక ప్రభుత్వం పారిపోతుంది
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పంటలు ఎండుతున్నాయి
హైదరాబాద్: నిన్నటి అజెండాలో 2 ముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు(Siddipet MLA Thanneeru Harish Rao) అన్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(Telangana Assembly Budget Sessions) ఐదో రోజు కొనసాగుతున్నాయి. హెచ్ఎండీఏ భూముల తాకట్టు పెట్టి రూ.20 వేల కోట్లు అప్పు, టీజీఐఐసీ భూములు తాకట్టు పెట్టి రూ. 10 వేల కోట్లు అప్పు, జలమండలి, జీహెచ్ఎంసీ నుంచి రూ. 10 వేల కోట్లు చొప్పున అప్పులు చేశారని హరీశ్ రావు తెలిపారు. మా ప్రశ్న రాకుండా ముందు ప్రశ్నలకు సాగదీశారని ఆయన ఆరోపించారు. మా ప్రశ్నలు రాకుండా గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు. ఈ అంశంపై నిన్న సభాపతికి ఫిర్యాదు చేశానని హరీశ్ రావు తెలిపారు.
ప్రభుత్వ ఉత్తర్వులు ఆన్ లైన్ లో పెట్టట్లేదన్న ఎంఐఎం ప్రశ్న రాకుండా చేశారని ప్రశ్నించారు. ప్రశ్నోత్తరాలు రద్దు చేసినట్లు నిన్న రాత్రి సర్కులర్ ఇచ్చారు. ప్రాజెక్టుల కింద పంట ఎండితే తమది బాధ్యత అని ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) చెబుతున్నారు. గోదవారి, కృష్ణా కింద పంటలు ఎండుతున్నాయని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పంటలు ఎండిపోతున్నాయని విమర్శించారు. వడ్ల కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీశ్ రావు ఆరోపించారు. పంట చేతికి వస్తున్నా రైతులకు(Farmers) పెట్టుబడి సాయం రావట్లేదని చెప్పారు. సమాధానాలు చెప్పలేక ప్రశ్నోత్తరాలు రద్దు చేశారని విమర్శించారు. బీఆర్ఎస్(Bharat Rashtra Samithi ) పార్టీని ఎదుర్కోలేక ప్రభుత్వం పారిపోతోందని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.






