calender_icon.png 14 December, 2025 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం ఇలాఖాలో బీఆర్‌ఎస్ ప్రభంజనం

14-12-2025 12:18:23 AM

  1. ప్రజాక్షేత్రంలో ప్రజలు గులాబీ పార్టీ వెంటే ఉన్నారనడానికి ఇదే నిదర్శనం
  2. అరాచకాలను ఎదిరించిన విజేతలు మీరు
  3. నూతన సర్పంచులకు కేటీఆర్ అభినందనలు
  4.   10 రోజుల పాటు జిల్లాల వారీగా సర్పంచులతో భేటీ కానున్న కేటీఆర్

హైదరాబాద్, డిసెంబర్ 13 (విజయక్రాంతి): సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌లో బీఆర్‌ఎస్ ప్రభంజనం కనబడిందని, రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి, అరాచకాలకు ఎదురొడ్డి నిలిచి సర్పంచ్‌లు అద్భుత విజయం సాధించారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని నంది నగర్ నివాసంలో పలు జిల్లాల నుంచి తరలివచ్చిన నూతన సర్పంచులు కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అధికార కాంగ్రెస్ పార్టీ పోలీసులను అడ్డుపె ట్టుకుని బలప్రయోగం చేసినా, ఎన్ని అక్రమాలకు పాల్పడినా ప్రజలు మాత్రం భారత రాష్ట్ర సమితి వెంటే నిలిచారని అన్నారు. మొదటి దశ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మద్దతుదారులు గెలవడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన సర్పంచులు ప దుల సంఖ్యలో విజయం సాధించడం గమనార్హమన్నారు.  సీఎంనియోజకవర్గంలోనే మన సర్పంచులు గెలవడం.. కాంగ్రెస్ పాలన పట్ల ఉన్న తీవ్ర ప్రజా వ్యతిరేకతకు, నిదర్శనమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 

వారం, పది రోజులు సర్పంచులతో భేటీ

నల్లగొండ, రంగారెడ్డి, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ తదితర జిల్లాల నుంచి వచ్చిన సర్పంచులు కేటీఆర్‌ను కలిశారు. రానున్న వారం, పది రోజుల పాటు కేటీఆర్ వరుసగా వివిధ జిల్లాల నుంచి వచ్చే నూతన సర్పంచులను కలుసుకోనున్నారు. కేటీఆర్ వారిని సత్కరించి, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు.